Security Arrangements: మోదీ సభకు చకచకా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:32 AM
ప్రధాని మోదీ రానున్న సందర్భంగా వెలగపూడిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కూలీలు, అధికారులు, పోలీసులంతా చర్యలు చేపట్టి, బహిరంగ సభ కోసం అన్ని వసతులు సిద్ధం చేస్తున్నారు.
మండుటెండలో శ్రమిస్తున్న వందల మంది
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐఏఎ్సలు, ఐపీఎస్లు
లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణం
గుంటూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి మే 2న ప్రధాని నరేంద్ర మోదీ రానుండడంతో వెలగపూడిలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. అధికారులు, సిబ్బంది, కార్మికులు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి దృష్ట్యా బందోబస్తు విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రధాని హెలిప్యాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి చేరుకొనే మార్గమంతా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టారు. గన్నవరం నుంచి అమరావతిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాక ప్రధాని మోదీ 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని తెలిసింది. 15 వేల మంది మహిళలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి మోదీకి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పైలాన్ తరహాలో పునాది రాయి
ఒకేసారి రూ.లక్ష కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా సభా ప్రాంగణం వెనకనే భారీ పైలాన్ని సీఆర్డీఏ సిద్ధం చేయిస్తోంది. ఈ పైలాన్ శాశ్వత కట్టడంగా అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపుగా 50 మీటర్ల వృత్తాకారంలో పైలాన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆకే రవికృష్ణ, మల్లికా గార్గ్, సర్వశ్రేష్ట్ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీ్షకుమార్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులంతా వెలగపూడిలోనే మకాం వేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, వాటికి పార్కింగ్ ఏర్పాటు, ప్రజలు కూర్చునే గ్యాలరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకొని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రత దృష్ట్యా ఆదివారం నుంచే హెలిప్యాడ్, బహిరంగ సభ వేధిక వద్దకు పోలీసు, రెవెన్యూ అధికారులను మినహా ఎవరినీ అనుమతించడం లేదు. బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు రానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, భోజనం అందుబాటులో ఉంచుతారు. అలానే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
సీనియర్ ఐఐఎస్లకు బాధ్యతలు
ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ నేతృత్వంలో పలువురు సెక్రెటరీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు పని విభజన చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి ఓవరాల్ ఇన్చార్జ్గా బాధ్యతలు కేటాయించారు. రోడ్డు షో బాధ్యతను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, పారిశుధ్యం పర్యవేక్షణను నగర కమిషనర్ పులి శ్రీనివాసులకు కేటాయించారు. వీవీఐపీలు, వీఐపీలను రిసీవ్ చేసుకొని వారికి సభా ప్రాంగణానికి తోడ్కొని వెళ్లే పనిని ఐఏఎస్, రెవెన్యూ అధికారులకు అప్పగించారు.