Share News

Pawan Salary Donation: అనాథ పిల్లలకు పవన్‌ జీతం

ABN , Publish Date - May 10 , 2025 | 04:41 AM

పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం నెలకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సాయం తన పదవి కొనసాగేంత వరకు కొనసాగుతుందనీ, ఇకపై పిల్లల ఇంటికే ఈ మొత్తాన్ని పంపించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు

Pawan Salary Donation: అనాథ పిల్లలకు పవన్‌ జీతం

  • పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మందికి రూ.5 వేల చొప్పున పంపిణీ

  • ఇకపై ప్రతి నెలా ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు

  • ప్రభుత్వం, పదవి ఉన్నంత కాలం ఈ సాయం కొనసాగుతుందని పవన్‌ వెల్లడి

అమరావతి/పిఠాపురం, మే 9 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు, చదువుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్‌కల్యాణ్‌ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి రూ.5 వేల చొప్పున రూ.2.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్‌ స్వయంగా ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా అందిస్తామని తెలిపారు. ఇకపై పిల్లల ఇంటి వద్దే ఈ మొత్తాన్ని ప్రతినెలా అందజేసే విధంగా చర్యలు తీసుకుంటానని పవన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం, పదవీ ఉన్నంత కాలం తాను వేతన రూపంలో తీసుకునే మొత్తాన్ని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని అనాథ పిల్లల కోసం ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.


ప్రజలిచ్చిన అధికారం నుంచి వచ్చే జీతమే..

పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి వారితో క్యాంపు కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. పిల్లలు, వారి సంరక్షకులతో మాట్లాడి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయితే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే జీతం తీసుకున్నాను. ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన పిల్లల భవిష్యత్తు, వారి చదువుల కోసం ఖర్చు చేయాలనుకున్నాను. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాలం నా జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను’ అని పవన్‌ పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల కోసం తన జీతం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ, కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌, పాడా డైరెక్టర్‌ చైత్రవర్షిణి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 04:41 AM