Minister Nara Lokesh : పెట్టుబడులకు రాష్ట్రం సానుకూలం
ABN , Publish Date - Jan 22 , 2025 | 03:48 AM
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖ మంత్రి లోకేశ్ దావో్సలో మంగళవారం బిజీబిజీగా గడిపారు.
భావనపాడును పెట్రోకెమికల్ హబ్గా మారుద్దాం
మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్కు ప్రతిపాదన
ఏపీలో జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ యూనిట్ పెట్టండి
ఆ సంస్థ సీఈవో ఐకీ డోర్ఫ్కు మంత్రి వినతి
మాస్టర్ కార్డ్, సిస్కో, కార్గిల్, డీహెచ్ఎల్, ఉబెర్, ఎర్నెస్ట్ యంగ్ , దసాల్ట్లకూ ఆహ్వానం
ఆయా ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన
దావోస్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులతో లోకేశ్ భేటీ
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖ మంత్రి లోకేశ్ దావో్సలో మంగళవారం బిజీబిజీగా గడిపారు. ప్రముఖ సంస్థల సీఈవోలు, చైర్మన్లు, వైస్ ప్రెసిడెంట్లతో వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, ముందుకు రావాలని ఆహ్వానించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాహన రంగ దిగ్గజ సంస్థ జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ సీఈవో ఐకీ డోర్ఫ్తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. కియా, ఇసుజి వంటి ప్రముఖ సంస్థలు కార్ల తయారీ యూనిట్లను తమ రాష్ట్రంలో నెలకొల్పాయని, అశోక్ లేల్యాండ్, వీర అండ్ ఆజాద్ మొబిలిటీ వంటి బస్ తయారీ ఓఈఎంలు కూడా కార్యకలాపాలు విస్తరించాలని చూస్తున్నాయన్నారు. ఆటోమొబైల్ తయారీ రంగం, సరఫరా చైన్ ఏర్పాటుకు విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలని తెలిపారు. జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సంస్థ తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఐకీ డోర్ఫ్ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఆహ్వానం
అన్ని అనుకూలతలు ఉన్న భావనపాడును పెట్రోకెమికల్ హబ్గా మార్చడానికి మిట్టల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ కోరారు. ఆ గ్రూపు చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. లోకేశ్ మాట్లాడుతూ పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమన్నారు. 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, వైజాగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలతలన్నారు. హెచ్పీసీఎల్-మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ హెచ్ఎంఈఎల్-హెచ్పీసీఎల్-మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 గిగావాట్ సామర్థ్య సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. లక్ష్మీ మిట్టల్ స్పందిస్తూ ఆర్సెలర్ మిట్టల్, జపాన్కు చెందిన నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ఏఎం, ఎన్ఎస్ ఇండియా పేరుతో అనకాపల్లి జిల్లా సమీపంలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.
డెవల్పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి
మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్తో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో డెవల్పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ రాష్ట్రంలో ఐటీ శ్రామిక శక్తిని తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. రాజమన్నార్ మాట్లాడుతూ తమ బోర్డు సభ్యులతో చర్చించి, ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటుపై....
విశాఖలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్ కట్సౌదా్సకు ఈ మేరకు సూచించారు.
ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్ పెట్టండి
ఆహార పదార్థాలు, వస్తువుల ట్రేడింగ్లో పేరున్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ఫుడ్ ఇన్నోవేషన్ సెంటరు పెట్టాలని ఆయనను కోరారు.
లాజిస్టిక్ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేయండి
అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్ సంస్థ డీహెచ్ఎల్ సీఈవో ప్లాబో సియానోతో జరిగిన భేటీలో.. ఏపీలో లాజిస్టిక్ బిజినెస్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని లోకేశ్ కోరారు. ఓడరేవులు, పరిశ్రమల హబ్లు, కోల్డ్ స్టోరేజీలు ఉన్న ఏపీలో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటుకు వినతి
విశాఖ, తిరుపతిలో ఎక్కడో ఒకచోట గ్లోబల్ డెలివరీ సెంటర్ను ఏర్పాటుచేయాలని ఎర్నెస్ట్ యంగ్(ఈవై) ఇండియా సీఈవో, సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానిని లోకేశ్ కోరారు. రాజీవ్ స్పందిస్తూ.. తమ సంస్థ 1.5 బిలియన్ డాలర్లతో ఈవై ఏఐ ఫ్లాట్ఫారంను ప్రారంభించిందని, ఏపీలోనూ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
ఏఐ వినియోగంలో ఏపీ టాప్: లోకేశ్
ఏపీ ప్రభుత్వం ఏఐ, డీప్టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ పాలనా వ్యవస్థలో ఏఐ వినియోగానికి గూగుల్ వంటి దిగ్గజ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. హెల్త్కేర్, సుస్థిరత వంటి కీలక రంగాల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు గత ఏడాది డిసెంబరులో గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ ఏడాది గ్లోబల్ ఏఐ మార్కెట్ 243 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని లోకేశ్ తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు
‘పర్యావరణ పరిరక్షణ-వాతావరణ ఉద్యమ భవిష్యత్తు’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ ఏపీలో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటవుతోందని, త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధమవుతోందని తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచి 25 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. 160 గిగావాట్లకుపైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం ఈ పాలసీ లక్ష్యమన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లక్ష్యమన్నారు.
స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ పెట్టండి
ప్రపంచంలో అగ్రగామి టొబాకో ఉత్పత్తుల సంస్థ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ ఆగ్నేయాసియా వైస్ చైౖర్పర్సన్ ఆండ్రియా వికోవాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ గాడ్ ఫ్రే ఫిలిప్స్ ద్వారా ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. గుంటూరు పరిసర ప్రాంతాలు అనువుగా ఉంటాయన్నారు. ఆండ్రియా మాట్లాడుతూ స్మోక్ ఫ్రీ సిగరెట్ల ఉత్పత్తులపై దృష్టి సారించామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పక పరిశీలిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News