Vamsi Health Issues: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వంశీ
ABN , Publish Date - May 15 , 2025 | 12:03 PM
Vamsi Health Issues: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు జిల్లా జైలు అధికారులు.
విజయవాడ, మే 15: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) జైలు అధికారులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. గత కొద్దిరోజులుగా వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయనను ఈరోజు (గురువారం) ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నిన్న(బుధవారం) ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు.
కాగా.. వంశీ పలు కేసుల్లో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రధానంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఈ కేసును సీఐడీ కూడా విచారిస్తున్న నేపథ్యంలో విజయవాడ సీఐడీ కోర్టులో కూడా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే డాక్యుమెంట్లు, షూరిటీల విషయంలో కాస్త జాప్యం జరగడంతో ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో వంశీని హాజరుపరిచిన సమయంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్లు తీవ్ర ఆవేదనతో న్యాయాధికారికి చెప్పుకున్నారు. దీంతో మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయధికారి.. వెంటనే వంశీకి వైద్యపరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే చికిత్స కూడా అందిచాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లా జైలు అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు.
Fire Accident:హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
వంశీ ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో మెమో దాఖలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంశీని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిన్ననే కోర్టు ఆదేశించడంతో వెంటనే ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించి స్కానింగ్తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే శ్వాసపరంగా వంశీ ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు. నిన్న పరీక్షల అనంతరం మెడిసన్ రాసిచ్చారు వైద్యులు. గత రాత్రి జిల్లా జైలులో ఇబ్బందిపడటంతో పాటు ఉదయం కూడా వంశీ శ్వాసకు సంబంధించి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన జైలు అధికారులు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. నేటి సాయంత్రం వరకు వంశీని ప్రభుత్వాస్పత్రిలోనే ఉంచి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
Read Latest AP News And Telugu News