CM Chandrababu: సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:26 PM
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చ జరిగింది. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.
అమరావతి, డిసెంబర్ 16: వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఈరోజు (మంగళవారం) సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామన్నారు. రియల్ టైమ్లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.
2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల ద్వారా అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. ప్రివెంటివ్ వెల్ నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలన్నారు. ఏపీలో మెడ్ టెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు.
రోగం వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే ఆ జబ్బు రాకుండా ముందస్తుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ టెక్నాలజీస్పై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. తద్వారా వైద్యారోగ్యంపై వ్యయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి ఎక్స్పర్ట్ గ్రూప్ సలహాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.
సామర్ధ్యాల పెంపుతో పాటు ప్రజలకు అత్యున్నత సేవలు అందాలన్నారు. క్వాంటం, ఏఐతో రియల్ టైమ్ డేటా విశ్లేషణ లాంటి వాటి ద్వారా ప్రజలకు సేవలు అందాలని చెప్పారు. ప్రస్తుతం ఏఐ ద్వారా నాలెడ్జి వ్యవస్థీకృతం అయ్యిందన్నారు. గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ప్రస్తుతం అంతా సామర్ధ్యాలను పెంచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా... అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంలో యూఎస్ ఏఐడీఎస్ ( UN AIDS)ప్రతినిధి పీటర్ పాయిట్, డబ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజీ చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులు ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
టీటీడీ పరకామణి కేసు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు
భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News