CM Chandrababu: ఫలితాల కోసం పరీక్ష రాసిన విద్యార్థిలా ఎదురు చూస్తా: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:55 PM
జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
అమరావతి, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై ఉన్నతాధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయం, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లలో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్ధిలా ఎదురు చూస్తానని.. దీనికి అనుగుణంగానే అధికారులు పని చేయాలని, లక్ష్యాలను చేరుకోవాలని సూచనలు చేశారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగామన్నారు. ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని.. మొత్తం 17 వర్టికల్స్లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్డీపీ పెరుగుతుందని చెప్పారు. లైవ్ స్టాక్, మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ సహా వేర్వేరు రంగాల్లో ఈ ప్రగతిని సాధించాలని కలెక్టర్లకు తెలియజేశారు.
వ్యవసాయ రంగం ఎప్పుడూ డిమాండ్ డ్రివెన్గా ఉండాలన్నారు. జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని... జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా కొన్ని ప్రాంతాలకు చేయూత ఇస్తున్నామని చెప్పారు. ప్రతీ యూనిట్, ప్రతీ శాఖలో సామర్ధ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు ప్రగతిలో, కలెక్టర్లు, ఉన్నతాధికారుల పనితీరులో క్వాంటం ఇంప్రూవ్మెంట్ కనిపించాలని తెలిపారు. పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయలని అన్నారు.
గతంలో తెలంగాణతో పోటా పోటీగా ఉండేవాళ్లమని.. గత ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాల వల్ల ఏపీ దక్షిణ భారతదేశంలో చివరి స్థానానికి చేరిందన్నారు. దీన్ని తిరిగి గేరప్ చేయాలని.. అగ్ర స్థానానికి చేరాలని చెప్పుకొచ్చారు. 2024 తర్వాత జీఎస్డీపీ కాస్తంత మెరుగైందన్నారు. వ్యవసాయ రంగంపై బాగా ఫోకస్ పెట్టాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎంత చేస్తున్నా... ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులను పంపేలా చేయగలిగితే వ్యవసాయ రంగం సుస్థిరత సాధిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో పంటలు పండించాలని అన్నారు. ఉద్యాన రంగంలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు.
రబీ ఖరీఫ్ రబీ మూడు సీజన్లు స్వల్ప కాలిక, ఐదేళ్ల కాలానికి మధ్య, 10 -15 ఏళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికల్ని తయారు చేసుకోవాలని ఆదేశించారు. డిమాండ్ డ్రివెన్ పంటలు, వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ లాంటి పదిసూత్రాలను ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నారు. హార్టికల్చర్ విషయంలో ఏపీ నెంబర్ 1 ఉన్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్వోదయ కింద అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. 2047కు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఏ ఒక్కరు వెనుకపడినా లక్ష్యాలను చేరుకోవటం కష్టతరం అవుతుందని తెలిపారు. గేట్స్ ఫౌండేషన్, అగ్రివాచ్ లాంటి సంస్థల సేవలను వినియోగించుకుని రైతులకు లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోవాని సమావేశంలో వెల్లడించారు.
దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా చర్యలు ఉండాలన్నారు. 60-70 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు కూడా ఈ ఉద్యాన పంటల రంగంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులను పండించేలా రైతులకు అవగాహన చైతన్యం కల్పించాలని అన్నారు. సేవల రంగంలో పర్యాటకం కూడా కీలకమని స్పష్టం చేశారు. బాపట్లలోని సూర్యలంక లాంటి బీచ్ల వద్ద ప్రముఖ బ్రాండ్లు వచ్చేలా చూడాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
దానిపై దృష్టి పెట్టండి: మంత్రి లోకేష్
విశాఖ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను గ్రౌండ్ చేసుకునేలా భూ కేటాయింపులు చేసుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఐటీ, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ మంత్రులంతా దీనిపై ప్రత్యేక దృష్టితో ఉన్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు
శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. స్వయంగా చెక్ ఇచ్చిన మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News