AP Cabinet Meeting: ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:22 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అమరావతిలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలిపింది.
అమరావతి, జూన్ 04: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి విలేకర్ల సమావేశంలో వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది. సత్ప్రవర్తన కల్గినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది.
వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది.
ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది. కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని మంత్రి మండలి అభిప్రాయపడింది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సహించడం కోసం నిబంధనలను సైతం సవరించామని స్పష్టం చేసింది.
విశాఖపట్నంలోని హరిత హోటల్లో యాత్రీ నివాస్ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు రూ. 13 కోట్ల 50 లక్షల ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని హరిత హోటల్ ఆధునీకరణకు టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు సైతం ఆమోదించింది.
గత ప్రభుత్వం హరిత హోటల్ అభివృద్ధి పనులకు రూ. 4.5 కోట్లుగా నిర్ణయించి అంచనాలను రూ. 13.5 కోట్లకు పెంచింది. దీంతో హరిత హోటల్ అభివృద్ధి కోసం రూ.13.50 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో క్వాంటం కంప్యూటర్, కృత్రిమ మేధ సంస్థల ఏర్పాటునకు మంత్రి మండలి ఆమోదించింది.
క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐలో రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ సంస్థల్లో స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అత్యధిక మందితో యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పాలని నిర్ణయం.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం. ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ఏడాదిలో 25 ఈ- కేబినెట్లు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే ఈ ఏడాది పాలనలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News