CM Chandrababu : ‘విశాఖ ఉక్కు’ ప్యాకేజీకి థ్యాంక్స్
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:43 AM
విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు....

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బాబు భేటీ
కేంద్ర బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించాలని వినతి
దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం
మాజీ రాష్ట్రపతి కోవింద్తోనూ సమావేశం
న్యూఢిల్లీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు. దావోస్ నుంచి నేరుగా గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం తొలుత నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కుకు అందించిన సహాయంపై కృతజ్ఞతలు తెలిపానని.. పోలవరం, అమరావతి, ఏపీ అభివృద్ధిపై చర్చించానని ఆ తర్వాత ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆయన కలుసుకున్నారు. జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికపై కోవింద్తో సీఎం చర్చించారని టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుకు ఈ సందర్భంగా కోవింద్ తన భార్య, కుటుంబ సభ్యులను పరిచయం చేశారు.
ఈ భేటీల్లో ఆయన వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, టీడీపీ ఎంపీ సానా సతీశ్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు ఉన్నారు. కాగా.. విశాఖ ఉక్కుకు రూ. 11,440 కోట్ల ప్యాకేజీని అందించినందుకు నిర్మలా సీతారామన్ను సీఎంతోపాటు కలిసి తాను కూడా కృతజ్ఞతలు చెప్పానని మంత్రి శ్రీనివాస వర్మ విలేకరులకు తెలిపారు. రానున్న బడ్జెట్లో పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.
ఇండోనేషియా ఆర్థిక మంత్రితో బాబు భేటీ
ఇండోనేషియా ఆర్థిక మంత్రి బుడి సాదికిన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. జ్యూరిచ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన.. విమానాశ్రయ ప్రాంగణంలోనే మంత్రితో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం..
Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..
Also Read : తురకా కిషోర్ను నెల్లూరు జైలుకు తరలింపు
Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
For AndhraPradesh News And Telugu News