Jagan uncle Ravindranath Reddy: జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:48 PM
తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఇప్పటికే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే టీటీడీ నిర్ణయాన్ని వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అతిక్రమించారు.
తిరుమల, ఆగస్ట్ 10: తిరుమల అంటేనే పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో.. అది కూడా ఆ దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారు కొలువైన ఆనంద నిలయం వెలుపల రాజకీయాలు, రీల్స్ వంటివి చేయవద్దంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ టీటీడీ క్లియర్కట్గా హెచ్చరించింది.
అయితే ఈ ఆదేశాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మేనమామ, ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి అతిక్రమించారు. ఆదివారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పలు రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన రాజకీయ ఆరోపణల వీడియోలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమలలో ఆయన ఇలా చేయడం ఏమిటంటూ రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిని పలువురు ప్రశ్నించారు.
ఈ మేరకు రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా టీటీడీ అధికారులను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. కాగా, తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని.. ఎవ్వరూ రాజకీయ వ్యాఖ్యలు, రీల్స్ వంటివి చేయవద్దని ఇటీవల టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి వేళ.. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. టీటీడీ నిర్ణయాన్ని అతిక్రమించారని విజిలెన్స్ విభాగం నిర్ణయించింది. ఆ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకునే దిశగా విజిలెన్స్ విభాగం అడుగులు వేస్తోంది.
కొండా మురళితో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. ఎందుకంటే..
ప్రాజెక్ట్లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More AndhraPradesh News And Telugu News