Pattabhiram: వారి అరెస్ట్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: పట్టాభి
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:50 PM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్ నిప్పులు చెరిగారు. వీరి అరెస్ట్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు.
తిరుపతి, ఆగస్ట్ 10: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కురుణాకర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు అభినయ రెడ్డికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తండ్రి కొడుకులను వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. వీరి అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. మిమ్మల్ని ఎవరూ కాపాడ లేరని కుండబద్దలు కొట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ వారికి సందర్భంగా ఆయన హితవు పలికారు. ఆదివారం తిరుపతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విలేకర్లతో మాట్లాడారు. భూ ఆక్రమణ, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, దొంగ ఓట్ల నమోదు, మద్యం కుంభకోణం తదితర కేసుల్లో వీరిద్దరు త్వరలో అరెస్టు కాబోతున్నారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమణల చిట్టా మొత్తం.. ఆధారాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక సిద్ధమైందన్నారు.
తనపల్లె రోడ్డులోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాలు భూమన కబ్జా చేశారని విమర్శించారు. భూమిని మింగిన భూ రాక్షసుడు కరుణాకర్ రెడ్డి అమాయకమైన ముఖం పెట్టుకుని నీచ నికృష్ట పనులు చేస్తూ నీతి కబుర్లు చెబుతాడంటూ పట్టాభిరామ్ వ్యంగ్యంగా అన్నారు. తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు నిలబడి.. తాను కబ్జా చేయలేదని ప్రమాణం చేయగలడా? అంటూ భూమనకు ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. జిరాక్స్ షాపు పెట్టుకున్న వ్యక్తి.. ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? అంటూ పట్టాభిరామ్ సందేహం వ్యక్తం చేశారు.
నీతిగా ఒక్క రూపాయి కూడా సంపాదించ లేమన్నారు. భూమన వారి అక్రమాలు ప్రపంచం మొత్తానికి తెలియాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఏకంగా 21 ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగాయని పట్టాభిరామ్ వివరించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో దోచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి తాను చెడిపోవటమే కాకుండా... కొడుకును వీధి రౌడీలా తయారు చేశాడంటూ ఎద్దేవా చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల సమయంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని దాదాపు 35 వేల దొంగ ఓట్లను చేర్చాడంటూ భూమనపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఈ మధ్య భూమన ఎక్కువగా వాడుతున్నాడంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అనే మాటను వాడటానికే భూమన అనర్హుడని ధ్వజమెత్తారు. దళిత బిడ్డ పవన్ను కొట్టి అన్న కొట్టాడని బలవంతంగా అతని వద్ద చెప్పించారన్నారు. రేపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సైతం ఇలాగే చెబుతారా? అంటూ పట్టాభిరామ్ సందేహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్లో సీఎం ఆకస్మిక పర్యటన
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
For More AndhraPradesh News And Telugu News