AP News: మద్యం ఇక ‘సురక్ష’తం.. యాప్తో నకిలీ, కల్తీకి చెక్
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:19 PM
నాణ్యమైన మద్యమే వినియోదారుడికి చేరాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈక్రమంలోనే ఓ సరికొత్త యాప్ను తీసుకువచ్చింది.
- కొన్నచోటే వినియోగదారుడు పరిశీలించవచ్చు
- స్కాన్ చేయగానే బాటిల్ చరిత్ర ప్రత్యక్షం
అనంతపురం: నాణ్యమైన మద్యమే వినియోదారుడికి చేరాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈక్రమంలోనే ఓ సరికొత్త యాప్ను తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారుడు తాను కొనే మద్యం అసలైందా... లేక నకిలీదా అనే విషయం అక్కడికక్కడే తెలిసిపోతుంది. యాప్ ద్వారా స్కాన్ చేస్తే చాలు తాను కొన్న లిక్కర్ బాటిల్ సమస్త వివరాలు కస్టమర్ కళ్ల ముందు కనిపించేలా ఈ యాప్ను రూపొందించారు. దాని ధర..? ఎక్కడ తయారైంది...?, ఏ బ్రాండ్..? ఏ డిపో నుంచీ సప్లై చేశారు..? ఇలా అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. ఇదే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. విపక్షాలు చేస్తున్న నకిలీ మద్యం గగ్గోలుకు, ఇతర ప్రశ్నలకు ఈ యాప్(APP) సమాధానం చెప్పనుంది. ఇది అటు కస్టమర్లు తాము తాగే లిక్కర్ నాణ్యతను తెలుసుకునేందుకు, రిటైల్ దుకాణదారుల అమ్మకాలు తెలుసుకోడానికి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది.

సులభంగా వాడొచ్చు
ఎవరైనా ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ను సులభంగా వాడొచ్చు. కస్టమర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లే స్టోర్లోకి వెళ్లి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ అవగానే కస్టమర్, రిటైలర్ ఆప్షన్లు చూపుతుంది. కస్టమర్ ఆప్షన్ ఎంపిక చేయాలి. తర్వాత కస్టమర్లు తాము కొనుగోలు చేసే బాటిల్పై ఉన్న హీల్ స్టిక్కర్(హాలోగ్రామ్)ను యాప్లోని స్కానర్ ద్వారా స్కాన్ చేయగా...కింద సెక్యూరిటీ కోడ్(క్యాప్చా)ను ఎంటర్ చేయగానే ఆ బాటిల్ వివరాలు అన్నీ ప్రత్యక్షం అవుతాయి.

ముఖ్యంగా ఆ మద్యం బ్రాండ్ పేరు, ఆ బాటిల్ ఎంఎల్ సైజ్, బ్యాచ్ ఐడీ, దాని ఎమ్మార్పీ , తయారు చేసిన కంపెనీ లోకేషన్ వివరాలు, తయారు చేసిన తేదీ, టైం, అది ఏ లిక్కర్ డిపో నుంచీ స్లై చేశారు..? ఏ రిటైల్ దుకాణంలో అమ్మకానికి అందుబాటులో ఉంది...? ఈ వివరాల్లో క్షణాల్లో తెలిసిపోతాయి. ఒక వేళ స్కాన్ చేసినా వివరాలు నాట్ ఫౌండ్ అని లేదా ఇన్వ్యాలీడ్ స్టాక్ అని వస్తే....అది నకిలీ మద్యంగా భావించవచ్చు. కస్టమర్లు ఫిర్యాదు చేయకుండానే ఆ వివరాలు ఎక్సైజ్శాఖ దృష్టికి వెళ్తాయి. ఈ యాప్ వల్ల కస్టమర్లు నకిలీ, కల్తీ మద్యం పాలు కాకుండా తమను తాము కాపాడుకునేందుకు వీలవుతుంది.
పారదర్శకతకు నిదర్శనం..
ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా దాదాపు రూ. 160 కోట్ల నుంచీ రూ. 165 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో అనంతపురం జిల్లాలో రూ.100 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతుంటే మిగతా అమ్మకాలు శ్రీసత్యసాయి జిల్లాలో జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లిక్కర్ 2.40 లక్షల కేసులు, బీర్లు లక్ష నుంచి 1.10 లక్షల కేసులు వరకూ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కస్టమర్లు తాము కొంటున్న లిక్కర్ నాణ్యతను తెలుసుకోవచ్చు. రిటైల్ దుకాణాదారులు సైతం లిక్కర్ బాటిళ్లను ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి అమ్మల్సి ఉంటుంది. రిటైల్ దుకాణాల్లో ఎంత మేరకు విక్రయాలు చేశారో....ఎన్ని బాటిళ్లు స్కాన్ చేశారు..? చూసి... స్కాన్ చేసిన బాటిళ్ల మేరకే వాళ్లకు లిక్కర్ డిపోల నుంచీ సప్లై చేస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ఎక్సైజ్ శాఖలో పారదర్శకతకు నిదర్శనంగా నిలవనుంది.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మద్యం అమ్మకాలపై ప్రభుత్వం, సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు, బార్లలో నకిలీ మద్యం అమ్ముతు న్నారనే వదంతులు ఎవరూ నమ్మవద్దు. కొందరు పనికట్టుకుని దుష్ప్ర చారం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. కస్టమర్లు దీన్ని మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుని వినియోగించుకోవచ్చు. ఇది చాలా సులభవంతం, వేగవంతమైంది.
- నాగమద్దయ్య, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్, ప్రొహిబిషన్శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లా
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News