Pawan Kalyan Social Initiative: ఉదయం వినతి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్..
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:34 PM
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇమిడియట్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే రోడ్డు మంజూరు చేశారు.
అమరావతి: ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును డిసెంబర్ 12వ తేదీ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామం తంబాళహట్టికి చెందిన జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామం రోడ్ల పరిస్థితి వివరించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్కు తెలిపారు. గ్రామానికి రోడ్డు వేయాలని వినతి చేశారు. అయితే, తాను వెంటనే చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

దీపిక విజ్ఞప్తిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. గ్రామానికి నాణ్యమైన రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం విజ్ఞప్తి చేయగా.. ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంతో దీపికతో పాటు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 12వ తేదిన క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు. ఒక్కో క్రికెటర్కు రూ. 5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. అంతేకాకుండా, ప్రతి మహిళా క్రికెటర్కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను కూడా అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు.
Also Read:
కల్తీ తేనెను ఎలా గుర్తించాలి? తప్పక తెలుసుకోండి..
టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. జగన్కు షాక్
For More Latest News