JC Prabhakar Reddy slams ASP: ఆయనకు చదువుంది.. బుద్ధి, జ్ఞానం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ABN , Publish Date - Oct 21 , 2025 | 01:39 PM
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేళ.. పోలీసు ఉన్నతాధికారిపై మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయనకు బుద్ది, జ్ఞానం లేదని మండిపడ్డారు.
తాడిపత్రి, అక్టోబర్ 21: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై స్థానిక మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ అనుసరిస్తున్న వైఖరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్లో కనిపించలేదంటూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం, తెలివి సైతం లేవన్నారు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే.. రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు.
ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి వచ్చాక కూడా క్రైమ్ రేట్ తగ్గ లేదన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న వాడిని తాడిపత్రికి తీసుకొచ్చారంటూ ఏఎస్పీ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ వాళ్లకి బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డారు. త్వరలో పది వేల మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి.. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మళ్లీ ఉత్తరప్రదేశ్కే పంపిస్తామని స్పష్టం చేశారు. కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబులు, ఎస్సై, సీఐలను చూసి నేర్చుకోవాలంటూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ల వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా సాధికారత, రక్షణకు సీఎం ప్రాధాన్యం: మంత్రి అనిత
కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం
For More AP News And Telugu News