Share News

Republic day 2024: గవర్నర్ తమిళై సంచలన వ్యాఖ్యలు.. గత ప్రభుత్వంపై నిప్పులు

ABN , Publish Date - Jan 26 , 2024 | 08:38 AM

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం అని స్పష్టం చేశారు.

Republic day 2024:  గవర్నర్ తమిళై సంచలన వ్యాఖ్యలు.. గత ప్రభుత్వంపై నిప్పులు

హైదరాబాద్: యావత్ భారతవని 75వ గణతంత్ర దినోత్సవ (Republic day) వేడుకలను సంబరంగా జరుపుకుంటోంది. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంది. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు లభించాలనే లక్ష్యంతో పని చేస్తోంది అని’ తమిళి సై సౌందర రాజన్ సందేశం ఇచ్చారు. గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌, అప్పటి సీఎం కేసీఆర్ మధ్య పడలేదు. ఈ విషయాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.

గవర్నర్ ప్రసంగం

‘రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా పాలకులు వ్యవహరించిన సమయంలో ప్రజల తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జరినప్పుడు, ఆ పాలనకు చరమగీతం పాడే అవకాశం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. అది సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా బుద్ది చెప్పింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని ఈ తీర్పుతో స్పష్టమైంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారింది. వ్యవస్థలు గాడి తప్పియి. అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ప్రభుత్వ ప్రాధాన్యం. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత.

గత పదేళ్ల పాలకుల వైఫల్యంతో యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం జరిగింది. యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ జరుగుతోంది. ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురికావద్దు. రైతుల విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాం.

గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి మొన్నటి వరకు ఉండేది. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనలో ఉంది. ప్రజా సమస్యలు ఆలకించేందుకు మంత్రులు అందుబాటులో ఉన్నారు. సచివాలయంలోకి సామాన్యుడు వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ప్రజా పాలన అడుగులు వేస్తోంది అని’ తన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 11:01 AM