Share News

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 18 , 2024 | 01:18 PM

భాగ్యనగరం హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ముప్పై ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు.

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ముప్పై ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామని, రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా కల్పించబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ సిద్ధం చేశామని, 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకెళ్తామని పేర్కొన్నారు. నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని, ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పక్కన ప్రమాదకరమైన డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు చేయడం సరైనది కాదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘ఫార్మా సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లెలో ప్లాన్ చేస్తున్నాం. 10 నుంచి 15 గ్రామాల్లో ఫార్మాను ప్లాన్ చేస్తున్నామని, ఒకే ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో ఫార్మా తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని అన్నారు. ఎవరూ అపోహలకు లోనుకావొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘ రాజకీయంగా నాకు అవగాహన ఉంది. నిర్మాణ సంస్థలతో చర్చిస్తాం. మేము అంత అపర మేధావులమని భావించి నిర్ణయాలు తీసుకోబోం. అలా నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డ అవుతుంది. పరిపాలనపై నాకు కొంత సమయం కావాలి. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుంది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 18 , 2024 | 01:19 PM