Share News

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!

ABN , Publish Date - Mar 15 , 2024 | 04:49 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్‌లను తాను ట్యాపింగ్‌ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!
CM Revanth Reddy

  • ఎన్నికలే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డ ప్రణీత్‌

  • కొద్ది నెలల ముందు నుంచి పెద్దఎత్తున నిఘా

  • ఓ ఎస్పీ, ఎస్‌ఐబీ అప్పటి చీఫ్‌ ఆదేశాలతోనే..

  • వందల ఫోన్లు ట్యాప్‌ చేశా: మాజీ డీఎస్పీ ప్రణీత్‌

  • ఆయన వాట్సాప్‌ చాట్‌లో విస్తుపోయే అంశాలు

  • కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా!

  • ప్రణీత్‌రావుతో అంటకాగినవారి చుట్టూ ఉచ్చు

హైదరాబాద్‌/సిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (SIB)లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్‌లను తాను ట్యాపింగ్‌ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు(Praneeth Rao) ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. రేవంత్‌ ఆయన సహచర బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రె స్‌కు డబ్బులు ఎక్కడినుంచి, ఏయే మార్గాల్లో, ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారు..? అనే వివరాలను ప్రణీత్‌ ట్యాపింగ్‌ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి రేవంత్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, సహకరించే అందరి ఫోన్‌లపైనా ట్యాపింగ్‌ కొనసాగినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఆదేశాల మేరకు నడుచుకున్న ప్రణీత్‌.. రాజకీయ నాయకులు, పోలీసులతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడికక్కడ తమకు అందుతున్న సమాచారం, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయం, ఇతర వార్‌ రూంల నుంచి రోజుల వ్యవధిలోనే వందల ఫోన్‌ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం, కీలక పత్రాల దహనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రణీత్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ చాటింగ్‌లను దర్యాప్తు అధికారులు పరిశీలించగా బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించారు. ఎన్నికల్లో డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నాయన్న సమాచారం గుర్తించి కట్టడి చేశారని స్పష్టమైంది. అరెస్టు సమయంలో ప్రణీత్‌రావును ప్రాథమికంగా విచారించగా ఒక ఎస్పీ, ఎస్‌ఐబీ అప్పటి చీఫ్‌ ఆదేశాల మేరకే తాను, తన బృందం పనిచేసినట్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రణీత్‌ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఏడు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ప్రణీత్‌రావు కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై సీఎం రేవంత్‌ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. దీంతో వారు సమగ్ర నివేదిక అందించారని తెలిసింది. ప్రణీత్‌ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తుల పేర్లు.. అనుసరించాల్సిన విధానాలపై సీఎంకు వివరించినట్లు సమాచారం. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు..

ప్రణీత్‌తో అంటకాగి కుట్రలో భాగస్వాములైన ఎస్‌ఐబీ అప్పటి ఉన్నతాధికారులను నేడో రేపో విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల ముందు పనిచేసినవారిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు వారి ఇళ్లలోనే ప్రత్యేక గదుల్లో (వార్‌ రూమ్‌లు) ఏర్పాట్లు చేసి, ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిని సిద్ధం చేసిన ప్రణీత్‌కు పలువురు సహచరులూ సహకరించినట్లు తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో విజిలెన్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు, ఎస్‌ఐబీ అధికారి ఇళ్లలో వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి, ప్రముఖుల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఓ పార్టీ నిధుల తరలింపులోనూ ప్రణీత్‌ కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. డబ్బు, బంగారం,వస్తువులను చేరవేసేందుకు సొంత, ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ వాహనాలను వినియోగించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్‌ ఫోన్‌ నుంచి కీలక వివరాలు సేకరించే పనిలో సైబర్‌ నిపుణులు ఉన్నారు. ఆయన తొలగించిన డేటాను రిట్రీవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది బయటకు వస్తే మరింతమంది అరెస్టయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఎస్‌ఐబీ లాగర్‌ రూమ్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలను విచారించారు.

ట్యాపింగ్‌ చేయమన్నది ఎవరు?

ట్యాపింగ్‌కు ఎవరు ప్రోత్సహించారు? ఎలాంటి సమాచారం సేకరించారు? ఎవరి పాత్ర ఎంత? అనే ప్రశ్నలకు ప్రవీణ్‌ స్పష్టంగా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించారు. ప్రణీత్‌ ఫోన్‌ డేటా విశ్లేషించి, ఏయే నంబర్లతో ఎంతమందితో టచ్‌లో ఉన్నారో తెలుసుకున్నారు. ఎవరెవరి ఫోన్‌లు ఎంత కాలం ట్యాప్‌ చేశారు? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్‌ రూమ్‌లకు ఈ డేటాను అందించినట్లు అంచనాకు వచ్చారు. డేటాను కాపీ చేసిన హార్డ్‌ డిస్క్‌లు ఎక్కడున్నాయో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేక బ్యారెక్‌.. పకడ్బందీ భద్రత..

ప్రణీత్‌ను విచారించి ఆధారాలు, సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రణీత్‌ న్యాయవాదులకు జడ్జి సూచించారు. శుక్రవారం వాదనలు జరిగే అవకాశముంది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న ఆయనను బుధవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. ప్రణీత్‌ను భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. సీసీ కెమెరా నిఘాతో పాటు నిరంతరం జైలు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అటువైపుగా ఇతర ఖైదీలను అనుమతించడం లేదు. గురువారం ఉదయం ప్రణీత్‌ తరపు న్యాయవాది అనుదీప్‌, సోదరుడు వంశీ ములాఖాత్‌ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 10:24 AM