Share News

Bhatti: ఆదాయ పెంపునకు మార్గాలు అన్వేషించండి

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:57 AM

రాష్ట్ర ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, రవాణా శాఖలు, ఆరోగ్యశ్రీ విభాగంపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

Bhatti: ఆదాయ పెంపునకు మార్గాలు అన్వేషించండి

  • రాబడుల శాఖల్లో లీకేజీలు లేకుండా చూడాలి

  • ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయండి

  • అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్‌, రవాణా శాఖలు, ఆరోగ్యశ్రీ విభాగంపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌, మే నెలల రాబడులు, వ్యయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబడుల శాఖల యంత్రాంగం పనితీరును మెరుగుపర్చుకోవాలని, ఎలాంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్టపర్చి బడ్జెట్‌ అంచనాలను అందుకోవాలని సూచించారు. ఆదాయం పెంపు కోసం వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ శాఖలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆదాయ పెంపు కోసం కృషి చేయాలన్నారు. వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును ఆర్టీసీ సమీక్షించుకుని, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలకు అప్పులను బదలాయించుకోవాలని సూచించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిందని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల షెడ్యూలుకు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనా.. ప్రగతి లేకపోవడానికి కారణాలేమిటంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని చెప్పారు.


పూర్తిగా అర్హమైన స్థలాలకే ఎల్‌ఆర్‌ఎ్‌సను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని, ఈ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇళ్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిస్థితిని సమీక్షించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారిగా చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయా చికిత్సలకు నిర్దేశించిన రేట్లనే ప్రైవేటు ఆస్పత్రుల్లో అమలయ్యేలా వాటి యాజమాన్యాలను ఒప్పించాలని చెప్పారు.

Updated Date - Jun 08 , 2024 | 04:57 AM