Share News

CM Revanth Reddy: రాష్ట్ర గీతం నిడివి 2:30 నిమిషాలు..

ABN , Publish Date - May 27 , 2024 | 03:36 AM

రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంగీత దర్శకుడు కీరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటి అయ్యారు.

CM Revanth Reddy: రాష్ట్ర గీతం నిడివి 2:30 నిమిషాలు..

  • ‘జయజయహే తెలంగాణ’కు తుదిరూపు

  • మొత్తం 3 వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి

  • మూడింటినీ విన్న ముఖ్యమంత్రి రేవంత్‌

  • సోనియా చేతులమీదుగా 2న విడుదల!

  • నేడో, రేపో మళ్లీ సమీక్షించనున్న సీఎం

  • ‘పుస్తకావిష్కరణ’కు నేడు కేరళకు

  • అక్కణ్నుంచి ఢిల్లీ వెళ్లి.. సోనియాను

  • రాష్ట్ర దశాబ్ది వేడుకకు ఆహ్వానించే చాన్స్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంగీత దర్శకుడు కీరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటి అయ్యారు. గేయానికి సంబంధించి మూడు వెర్షన్లను కీరవాణి సిద్ధంచేసి రేవంత్‌కు వినిపించారు. వాటిలో 2.30 నిమిషాల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవడానికి ఖరారు చేసినట్టు సమాచారం. అలాగే.. కవి అందెశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 13 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు సమాచారం. 3.30 నిమిషాలపాటు ఉండే మరో వెర్షన్‌ను కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది.


ఈ మూడింటిని రేవంత్‌ రెడ్డి పూర్తిగా విని, కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు సమాచారం. సోమ, మంగళవారాల్లో మరోమారు దీనిపై సీఎం రేవంత్‌ సమీక్షించనున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఖరారైన వాటిని జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చేతులమీదగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. కాగా.. సీఎంతోపాటు కీరవాణిని కలిసినవారిలో కవి అందెశ్రీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, అయోధ్యరెడ్డి, సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ ఉన్నారు. ఇక.. ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ కేరళ స్టేట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ సాదిక్‌ అలీ షిహాబ్‌ తంగల్‌ రచించిన ‘ద మెసేజ్‌ ఆఫ్‌ లవ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌ సోమవారం కేరళకు వెళ్లనున్నారు. అనంతరం.. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని స్వయంగా ఆహ్వానించేందుకు ఆయన అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - May 27 , 2024 | 03:36 AM