Numaish: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ షురూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?
ABN , Publish Date - Jan 01 , 2024 | 06:27 PM
నాంపల్లి ( Nampally ) ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ( Numaish ) ప్రారంభమైంది. నుమాయిష్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనున్నది.
![Numaish: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ షురూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_NU_b9650cd290.jpg)
హైదరాబాద్: నాంపల్లి ( Nampally ) ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ( Numaish ) ప్రారంభమైంది. నుమాయిష్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనున్నది. 46 రోజుల పాటు నుమాయిష్ కొనసాగనున్నది. 83 వ అల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్లో దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర 40 రూపాయలుగా చేశారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 వరకు నుమాయిష్ కొనసాగుతుంది. వీక్ ఎండ్ లో రాత్రి 11 వరకు నుమాయిష్ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ సుదుపాయం కల్పించారు. జనవరి 9వ తేదీ ఉమెన్స్ డే సందర్భంగా ఆ రోజు మహిళకు మాత్రమే అనుమతిని కల్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు సేవలు నడవనున్నాయి. నుమాయిష్కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలీస్, అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించనున్నారు.
హైదరాబాద్ అంటేనే నాంపల్లి ఎగ్జిబిషన్కి ప్రసిద్ధి: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకువస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నుమాయిష్ కమిటీ సభ్యులు సత్కరించారు. జనవరి 1వ తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారు.ఈ సదర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ...నుమాయిష్ లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. నుమాయిష్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నుమాయిష్కు వచ్చే వ్యాపారులు, ప్రజలకు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రానికి నుమాయిష్ గర్వ కారణంగా నిలుస్తోంది: శ్రీధర్ బాబు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థల యాజమాన్యాలు నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయని చెప్పారు. 30వేల మంది విద్యార్థులు ఎగ్జబిషన్ సొసైటీకు చెందిన విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారన్నారు. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపార వేత్తలను తయారు చేశారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పేరుకుపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు. రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.