Share News

TS Assembly: అంతా చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. సభలో గులాబీ పార్టీని ఏకిపారేసిన ఉత్తమ్

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:34 PM

Telangana: సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

TS Assembly: అంతా చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. సభలో గులాబీ పార్టీని ఏకిపారేసిన ఉత్తమ్

హైదరాబాద్, ఫిబ్రవరి 17: సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister uttam Kumar Reddy) ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై (BRS Government) మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 2014-23 మధ్య ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని.. ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు రూ.11 లక్షలు అని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి ఖర్చు 12 రెట్లు పెరిగిందన్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి కావడానికి రూ.1.75 లక్షల కోట్లు కావాలన్నారు.

కేసీఆర్ వల్లే అన్యాయం...

తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని ఆరోపించారు. గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్‌ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని.. బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయన్నారు. కేసీఆర్‌ విధానాల వల్లే హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కృష్ణా బేసిన్‌లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలన్నారు. 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదన్నారు. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగింతకు గత ప్రభుత్వమే సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి చెప్పుకొచ్చారు.

తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్లతో కాంగ్రెస్ రూపకల్పన చేసిందన్నారు. 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రతిపాదన చేసిందన్నారు. గత పాలకులు వేల కోట్ల పనులను పక్కన పెట్టి రూ.38,500 కోట్ల నుంచి రూ.81 వేల కోట్లకు పెంచిందని మండిపడ్డారు. కృష్ణా జలాల నిర్వాకం, గోదావరిపై బ్యారేజ్‌ల వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం చిన్నాభిన్నమైందన్నారు. రూ.1.8 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో చేసిన అప్పులు, వడ్డీల వల్ల రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుంగిపోయిందన్నారు.


కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతపై...

2014 వరకు నీటిపారుదల రంగానికి ఖర్చు రూ.54,234 కోట్లు అని తెలిపారు. బీఆర్ఎస్‌ పాలనలో నీటిపారుదలకు ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని అన్నారు. కొత్తగా వచ్చే ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు అని.. ఒక్కో ఎకరం సాగుకు సగటు ఖర్చు రూ.11.45 లక్షలుగా చెప్పుకొచ్చారు. 2015 నుంచి కొన్ని ఏళ్లు 299 టీఎంసీలకే గత ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. మరి కొన్నేళ్లు 50 శాతం వాటా రావాలని ప్రతిపాదించారన్నారు. తెలంగాణకు రావాల్సిన 68 శాతం వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయలేదని మండిపడ్డారు. అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి భేటీ జరిగిన 2016 సెప్టెంబర్‌ 21న ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారన్నారు. 2020 అక్టోబర్‌ 6న రెండో భేటీలో కేసీఆర్ పాల్గొన్నారన్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేస్తుందని నిర్ణయం చేశారన్నారు.

2021 జులై 15న కేఆర్‌ఎంబీపై కేంద్రం గెజిట్‌ విడుదల చేసిందని తెలిపారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని నోటిఫికేషన్‌లో ఉందన్నారు. ప్రాజెక్టులు పూర్తికాగానే వాటి పరిధిని కేఆర్‌ఎంబీకికి అప్పగించాలని నోటిఫికేషన్‌లో నిబంధన ఉందని తెలిపారు. కేంద్రం గెజిట్‌ను గత ప్రభుత్వం అసలు సవాల్‌ చేయలేదన్నారు. గత ప్రభుత్వం సవాల్‌ చేయకపోవడంతోనే నోటిఫికేషన్‌ అమలైందని.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్‌ఎస్‌ మొగ్గు చూపిందని మంత్రి పేర్కొన్నారు. 15,16వ కేఆర్‌ఎంబీ భేటీల్లో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌రావు పాల్గొన్నారని.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతకు అంగీకరించారన్నారని తెలిపారు. ఎన్నికల వేళ ఏపీ పోలీసులు సాగర్‌ను ఆక్రమించే యత్నం చేశారని.. పోలీసుల సాయంతో ఏపీ అక్రమంగా నీటిని విడుదల చేసిందని మండిపడ్డారు. ఏపీ చర్యపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిశ్శబ్దం వహించిందన్నారు. గత డిసెంబర్‌ 1న నీటిపారుదల కార్యదర్శి స్మితా సబర్వాల్‌.. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారని.. శ్రీశైలం, సాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకారం తెలిపారని చెప్పుకొచ్చారు.

ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

పాలమూరు ఎత్తిపోతల నిధులకు కేంద్రం హామీ లభించిందన్నారు. కడెం ప్రాజెక్ట్‌ నిర్వహణ లోపంతో 65 వేల ఎకరాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 15 టీఎంసీలకు మించి నీరు తీసుకెళ్లకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని... ఈ ఏడాది ఏడు లక్షల ఆయకట్టుకు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 12:34 PM