Share News

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:52 AM

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

MLA Lasya: లాస్యనందిత మృతిపట్ల కేసీఆర్‌తోపాటు పలువురు నేతల సంతాపం

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత (Lasya Nanditha) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేటిఆర్ సంతాపం..

లాస్య నందిత ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. చాల మంచి యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబానికి బలం చేకూర్చాలని తన హృదయపూర్వక ప్రార్థనలని కేటీఆర్ పేర్కొన్నారు.

నిరంజన్ రెడ్డి..

బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం ప్రకటించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర విషాదమని, తండ్రి అకాలమరణంతో చిన్న వయసులో.. విద్యాధికురాలైన ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కిందని, అంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నిరంజన్ రెడ్డి దేవుని ప్రార్ధించారు.

లాస్య మృతి చాలా బాధాకరం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

కాగా.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితమృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు.

Updated Date - Feb 23 , 2024 | 09:00 AM