Share News

BRS: ‘చలో నల్గొండ’ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం...

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:06 PM

Telangana: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రాజెక్ట్ ఫైట్ తారా స్థాయికి చేరుకుంది. ఓ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరగా.. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం నల్గొండకు బయలుదేరింది.

BRS: ‘చలో నల్గొండ’ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం...

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రాజెక్ట్ ఫైట్ తారా స్థాయికి చేరుకుంది. ఓ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడిగడ్డ సందర్శనకు బయలుదేరగా.. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం నల్గొండకు బయలుదేరింది. తెలంగాణ నదీ జలాలపైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ (BRS) నేడు (మంగళవారం) నల్లగొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కాసేపటి క్రితమే నల్గొండకు బయలుదేరి వెళ్లింది. తెలంగాణ భవన్ నుంచి ‘’చలో నల్గొండ’’ బహిరంగ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బయలుదేరారు.


ఇది మొదటి అడుగు మాత్రమే...

ఈ సంద్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ గళమెత్తిందన్నారు. నదీజలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.

బీఆర్ఎస్ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని తెలిపారు. నిన్న అసెంబ్లీలో అబద్దాలను ప్రచారం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం తమపైన ఉన్నదన్నారు. ఈరోజు బీఆర్‌ఎస్ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు నదీ జలాలపైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపైన సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమన్నారు. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే అని.. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2024 | 12:06 PM