Share News

TS Police: ఈ ఖాకీలకు ఏమైంది?.. హైదరాబాద్‌లో మరో సీఐ సస్పెండ్

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:42 AM

Telangana: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

TS Police: ఈ ఖాకీలకు ఏమైంది?.. హైదరాబాద్‌లో మరో సీఐ సస్పెండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 6: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్‌ను (Miyapur CI PremKumar) సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (Cyberabad CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే కారణంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.

అసలేం జరిగిందంటే..

భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియార్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల మియాపూర్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై సదరు మహిళ.. సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ రాసలీలల బాగోతం బయటపడింది. లోతుగా విచారణ చేపట్టిన సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి.. ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


వరుస సస్పెన్షలు... పోలీస్ శాఖలో జరుగుతోంది?

కాగా.. తెలంగాణలో వరుసగా సీఐల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. విధులు సరిగ్గా నిర్వర్తించని పలువురు సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుకు సంబంధించి పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటంతో పాటు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తేల్చటంతో పాటు ఆయనను సస్సెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును నిన్న (సోమవారం) గుంతకల్ రైల్వేస్టేషన్‌లో పోలీసులకు చిక్కారు. అలాగే ఇదే కేసులో బోదన్ సీఐ ప్రేమ్‌కుమార్‌‌పై సస్పెన్షన్ వేటు పడటంతో పాటు... అరెస్ట్ అయ్యాడు.

ఇటు గోపాలపురం సీఐ మురళీధర్‌, ఎస్‌ఐ దీక్షిత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) సస్పెండ్ చేశారు. గోపాలపురంలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో సరిగా విచారణ జరుపలేదని ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పటాన్‌చెరు సీఐ లాలూనాయక్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సీఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రూపేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏకంగా పోలీస్‌స్టేషనే ప్రక్షాళన...

మరోవైపు ఏకంగా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రక్షాళన చేయండం హాట్ టాపిక్ అయ్యింది. భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ.. పంజాగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 11:52 AM