Share News

heavy rainfall: భారీ వర్షం..

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:03 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల ట్రాఫిక్‌ నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

heavy rainfall: భారీ వర్షం..

  • హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు

  • జలమయం.. రోడ్లను ముంచేసిన వరద

  • న్యూమెట్టుగూడలో 7.5 సెం.మీ. వర్షం

  • పార్సిగుట్టలో కొట్టుకుపోతున్న కారు నుంచి

  • ఐదుగురిని కాపాడిన యువకులు

  • వానలతో కృష్ణా ప్రాజెక్టులకు పెరిగిన వరద

  • నేడు అతి భారీ వర్షాలు.. రేపు భారీ వానలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల ట్రాఫిక్‌ నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మారెడ్‌పల్లి న్యూమెట్టుగూడలో అత్యధికంగా 7.5 సెం.మీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, యూసు్‌ఫగూడ, ముషీరాబాద్‌, మారెడ్‌పల్లి, మల్కాజిగిరి పరిధిలోని లోతట్టు ప్రాంతాలు మునిగి కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. బేగంపేట, ప్రకాశ్‌నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ మాదాపూర్‌, ఖైరతాబాద్‌లో పర్యటించారు. జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి.. వరద నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు వికారాబాద్‌ పట్టణం, మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌లోనూ భారీ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.


ఐదుగురిని కాపాడిన యువకులు..

వరదలో కొట్టుకుపోతున్న కారులోని ఐదుగురు వ్యక్తులను ముగ్గురు యువకులు కాపాడారు. ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీకి చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా భారీ వర్షం వస్తుండటంతో పార్సిగుట్ట చౌరస్తా వద్ద కారును నిలిపారు. ఈ నేపథ్యంలోనే వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో కారు వరదలో కొట్టుకొని పోసాగింది. అక్కడే ఓ ఇంటి వద్ద నిల్చోని ఉన్న మార్టిన్‌, ప్రణీత్‌ యాదవ్‌, నాగాచారి ఇది గమనించి.. కారును వద్దకు వెళ్లి డోర్లు తీసే ప్రయత్నం చేయగా చుట్టూ నీరుండటంతో ఎంతకూ రాలేదు. దీంతో కారు అద్దాలు పగులగొట్టి అందులోని ఐదుగురిని రక్షించారు. భారీ వర్షం కారణంగా పంజాగుట్టలోని పీవీఆర్‌ సినిమా థియేటర్‌లోకి నీరు లీక్‌ అయ్యింది. దీంతో సినిమా ఆపాలంటూ ప్రేక్షకులు థియేటర్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే సినిమా చూడొద్దనుకుంటే వెళ్లొచ్చంటూ వారు నిర్లక్ష్యంగా బదులివ్వటంతో.. 100కు కాల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అన్ని పరిశీలించి చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట ఏసీపీ ఎస్‌.మోహన్‌ తెలిపారు.


భారీ నుంచి అతి భారీ వర్షాలు..

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. మంగళవారం కూడా భారీ వానలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండ్రోజులు ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది.


కృష్ణా ప్రాజెక్టులకు పెరిగిన వరద

కృష్ణా బేసిన్‌లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరుగుతోంది. ఆల్మట్టి జలాశయానికి 28,130 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 94.23 టీఎంసీలున్నాయి. దీంతో 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 3,414 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 37.65 టీఎంసీలకు.. ప్రస్తుతం 25.83 టీఎంసీలకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు కూడా వరద మొదలైంది. 3,271 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి 9.66 టీఎంసీలకు.. ప్రస్తుతం 7.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని నుంచి నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తున్నారు. వరి నారుమళ్లు పోసుకోవడానికి జూరాల ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్రకు 12,194 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఇటు మేడిగడ్డ బ్యారేజీకి 41,200క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 04:03 AM