Share News

TG: ప్రజల కోసం పోరాడా..నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్లా

ABN , Publish Date - Apr 26 , 2024 | 03:27 AM

నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడిన తాను.. లాఠీ దెబ్బలు తిన్నానని, వందలాది కేసులు పెట్టినా ప్రజలకు అండగా నిలిచానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

TG: ప్రజల కోసం పోరాడా..నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్లా

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏం చేశారు

  • ఆ రెండు పార్టీలూ ఒక్కటే: బండి సంజయ్‌

  • కరీంనగర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

కరీంనగర్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడిన తాను.. లాఠీ దెబ్బలు తిన్నానని, వందలాది కేసులు పెట్టినా ప్రజలకు అండగా నిలిచానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లానని తెలిపారు. గురువారం కరీంనగర్‌లో సంజయ్‌ నామినేషన్‌ వేశారు.


ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ హాజరయ్యారు. నామినేషన్‌ అనంతరం నిర్వహించిన ర్యాలీలో సంజయ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులెవరూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా లేరని చెప్పారు. వారు ఏనాడైనా ప్రజల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించారు. తాను లోకల్‌ అని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాన్‌ లోకల్‌ అని తెలిపారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి లోకలా..? నాన్‌ లోకలా..? చెప్పుకోలేని గందరగోళంలో ఆ పార్టీ క్యాడర్‌ ఉందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని.. వారు గెలిస్తే రూ.వేల కోట్లు సంపాదిస్తారని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే వేల కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరూ కేసీఆర్‌ అనే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని సంజయ్‌ విమర్శించారు.


సంజయ్‌ గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సిగ్గుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కాంగ్రె్‌సలోకి పంపి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను చూసిన తర్వాత బండి సంజయ్‌ ప్రచారం చేయకుండానే గెలుస్తారన్న విశ్వాసం కలుగుతోందని చెప్పారు.

బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం సంజయ్‌ రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారని గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ అన్నారు. మోదీని మరోసారి ప్రధానిగా ఆశీర్వదించాలని, తెలంగాణ సంక్షేమాన్ని ఆయన చూసుకుంటారని తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 03:27 AM