Share News

MI vs GT: చెలరేగిన బుమ్రా, కోయెట్జీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:33 PM

పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ముంబై ఇండియన్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బుమ్రాకు తోడుగా గెరాల్డ్ కోయెట్జీ(2/27) కూడా సత్తా చాటాడు. ముఖ్యంగా వీరిద్దరు డెత్ ఓవర్లలో గుజరాత్‌కు పరుగులు రాకుండా కట్టడి చేశారు.

MI vs GT: చెలరేగిన బుమ్రా, కోయెట్జీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..

అహ్మదాబాద్: పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ముంబై ఇండియన్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బుమ్రాకు తోడుగా గెరాల్డ్ కోయెట్జీ(2/27) కూడా సత్తా చాటాడు. ముఖ్యంగా వీరిద్దరు డెత్ ఓవర్లలో గుజరాత్‌కు పరుగులు రాకుండా కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఆరంభంలో, డెత్ ఓవర్లలో వికెట్లు తీసి గుజరాత్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(45), శుభ్‌మన్ గిల్(31), రాహుల్ తెవాటియా(22) పర్వాలేదనిపించినా మిగతా వారంతా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే వృద్ధిమాన్ సాహా(19) వికెట్ కోల్పోయింది. అద్భుత యార్కర్‌తో సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 31 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న శుభ్‌మన్ గిల్‌ను 8వ ఓవర్‌లో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా పెవిలియన్ చేర్చాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 బంతుల్లో 31 పరుగులు చేసిన గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న రోహిత్ శర్మకు దొరికిపోయాడు.


అనంతరం సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కలిసి మూడో వికెట్‌కు 20 బంతుల్లో 40 పరుగులు జోడించారు. 17 పరుగులు చేసిన అజ్మతుల్లాను 12వ ఓవర్‌లో గెరాల్డ్ కోయెట్జీ పెవిలియన్ చేర్చాడు. 17వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన బుమ్రా గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకున్న డేవిడ్ మిల్లర్ (12), సాయి సుదర్శన్(45)ను వరుసగా పెవిలియన్ చేర్చాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సాయి సుదర్శన్ 39 బంతుల్లో 45 పరుగులు చేశాడు. దీంతో 134 పరుగులకు గుజరాత్ సగం వికెట్లు కోల్పోయింది. వుడ్ వేసిన 18వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా ఓ సిక్సు, 2 ఫోర్లు బాదడంతో 19 పరుగులొచ్చాయి. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. కోయెట్జీ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన తెవాటియా(22) నమన్ ధీర్‌కు దొరికిపోయాడు. ముందుకు పరిగెత్తి నమన్ ధీర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. చివరి ఓవర్‌లోనూ 7 పరుగులే వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. విజయ్ శంకర్(6), రషీద్ ఖాన్(4) నాటౌట్‌గా నిలిచారు. చివరి 5 ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో 44 పరుగులే వచ్చాయి. ముఖ్యంగా చివరి 2 ఓవర్లలో 14 పరుగులే వచ్చాయి. ముంబై బౌలర్లలో బుమ్రా 3, కోయెట్జీ 2, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 09:39 PM