Share News

Mayank Agarwal: విమానంలో టీమిండియా క్రికెటర్‌కు అస్వస్థత.. పోలీస్ కేసు నమోదు

ABN , Publish Date - Jan 31 , 2024 | 10:55 AM

టీమిండియా క్రికెటర్, రంజీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ విమానంలో అస్వస్థతకు గురయ్యాడు. సీటు ముందు ప్లాస్టిక్ కవర్‌లో ఉంచిన హానికారక ద్రవాన్ని మంచి నీళ్లనుకుని తాగడంతో నోట్లో ఇబ్బంది మొదలైంది.

Mayank Agarwal: విమానంలో టీమిండియా క్రికెటర్‌కు అస్వస్థత.. పోలీస్ కేసు నమోదు

టీమిండియా క్రికెటర్, రంజీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ విమానంలో అస్వస్థతకు గురయ్యాడు. సీటు ముందు ప్లాస్టిక్ కవర్‌లో ఉంచిన హానికారక ద్రవాన్ని మంచి నీళ్లనుకుని తాగడంతో నోట్లో ఇబ్బంది మొదలైంది. నోరు వాచిపోయి బొబ్బలు రావడంతో మాట్లాడలేకపోయాడు. గొంతు నొప్పి వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని ఆపి మయాంక్ అగర్వాల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ అగర్వాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


వెస్ట్ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెటర్. ఇప్పుడు అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే అతని మేనేజర్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్‌సీసీపీఎస్ (న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్) కింద ఫిర్యాదును నమోదు చేసాడు. మాయాంక్ అగర్వాల్ విమానంలో కూర్చున్నప్పుడు అతని సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్‌లోని హానికర ద్రవాన్ని మంచి నీరుగా భావించి కొంచెం తాగాడు. అకస్మాత్తుగా అతని నోటిలో చికాకు వచ్చింది. నోరు వాచిపోయి మాట్లాడలేకపోయాడు. గొంతు నొప్పి కూడా వచ్చింది. దీంతో అతడిని వెంటనే ఐఎల్‌ఎస్ (ILS) ఆసుపత్రికి తరలించారు. అతనికి నోటిలో వాపు, పూతల ఉన్నాయి." అని తెలిపారు.

రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి కిరణ్ గిట్టే మాట్లాడుతూ "పోలీసులు మాయాంక్ అగర్వాల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో మేము దర్యాప్తు చేస్తాము. అతని మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం మయాంక్ రేపు బెంగుళూరుకు వెళ్తాడు. అక్కడే అగర్తలాలో అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో చికిత్సను అందిస్తాము." అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనతో కర్ణాటక జట్టు ఫిబ్రవరి 2 నుంచి రైల్వేస్‌తో ఆడే తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ అగర్వాల్ అందుబాటులో ఉండడంలేదు. దీంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ నిఖిన్ జోస్ కర్ణాటకకు సారథ్యం వహించనున్నాడు. కాగా త్రిపురతో ఆడిన చివరి మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 10:58 AM