Share News

Virat Kohli: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:52 PM

టీ20 వరల్డ్‌కప్‌లో జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని..

Virat Kohli: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!
Mathew Hayden Sensational Remark On Virat Kohli

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో (Ireland) తలపడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు కూర్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ (Mathew Hayden) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓపెనర్‌గా పంపాలని, లేకపోతే అతను జట్టులో ఉండి దండగ అని కుండబద్దలు కొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మిడిలార్డర్‌లో వస్తే బాగుంటుందని, గతంలో ఆ స్థానంలో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని గుర్తు చేశాడు.

Read Also: అన్నింటికన్నా అదే ముఖ్యం.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ క్లారిటీ

ఓ ఇంటర్వ్యూలో హేడెన్ మాట్లాడుతూ.. ‘‘ఐదుగురు రైట్-హ్యాండ్ బ్యాటర్లను వరుసగా పంపితే వర్కౌట్ అవ్వదు. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ ఉంటే జట్టుకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యశస్వితో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలి. లేకపోతే అతను జట్టులో ఉండి ఉపయోగం లేదు. ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, ఓపెనర్‌గా వస్తేనే బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ విలక్షణ ఆటగాడని, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు అతను ఏమాత్రం సంకోచించడని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ టీ20లలో నాలుగో స్థానంలో రోహిత్‌కి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ గ్రూప్‌ని అతను నడిపించగలడని హేడెన్ పేర్కొన్నాడు.


నాలుగో స్థానంలో రోహిత్ గణాంకాలు

టీ20లలో రోహిత్ శర్మ ఇప్పటివరకూ 151 మ్యాచ్‌లు ఆడి 3974 పరుగులు చేశాడు. అందులో 27 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 481 రన్స్‌ చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 91 ఇన్నింగ్స్‌లలో మిడిలార్డర్‌లో వచ్చి.. 130కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 2565 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్‌ సెంచరీలూ ఉన్నాయి. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే.. రోహిత్ మిడిలార్డర్‌లో వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హేడెన్‌కి ముందు టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫ్ కూడా.. యశస్వి-కోహ్లీ ఓపెనర్లుగా రావాలని, రోహిత్‌ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.


ఇండియా vs ఐర్లాండ్

భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌తో భారత్ తన ప్రయాణాన్ని కొనసాగించబోతోంది. ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ జూన్ 5వ తేదీన జరగనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత జట్టు బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. అందులో భారత్ ఘనవిజయం సాధించింది కానీ, విరాట్ కోహ్లీ మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 03:52 PM