Share News

RCB vs PBKS: కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు.. మోస్తారు స్కోర్‌కే పరిమితమైన పంజాబ్

ABN , Publish Date - Mar 25 , 2024 | 09:29 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 177 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45) మినహా మిగతా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ విలువైన పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించింది.

RCB vs PBKS: కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు.. మోస్తారు స్కోర్‌కే పరిమితమైన పంజాబ్

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 177 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45) మినహా మిగతా బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ విలువైన పరుగులు చేశారు. దీంతో పంజాబ్ జట్టు మంచి స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లు జితేష్ శర్మ(27), ప్రభుసిమ్రాన్ సింగ్(25), సామ్ కర్రాన్(23), శశాంక్ సింగ్(21) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్(2/26), గ్లెయిన్ మాక్స్‌వెల్ (2/29), యష్ దయాల్ (1/23) కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే జానీ బెయిర్‌స్టో(8) వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో ఔటయ్యాడు. అనంతరం రెండో వికెట్‌కు మరో ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ కలిసి 55 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 9వ ఓవర్‌లో ప్రభుసిమ్రాన్ సింగ్‌(25)ను ఔట్ చేసిన స్పిన్నర్ మ్యాక్స్‌వెల్ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


కాసేపటి తర్వాత లివింగ్ స్టోన్(17)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న శిఖర్ ధావన్‌ను ఔట్ చేశాడు. దీంతో 98 పరుగులకు పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. 37 బంతులు ఎదుర్కొన్న ధావన్ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. అనంతరం జితేష్ శర్మ, సామ్ కర్రాన్ కలిసి ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 52 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పంజాబ్ స్కోర్ 150 పరుగులకు చేరుకుంది. డెత్ ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో యష్ దయాల్ బౌలింగ్‌లో కర్రాన్(23), మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జితేష్ శర్మ(27) ఔటయ్యారు. దీంతో 154 పరుగులకు పంజాబ్ 6 వికెట్లు కోల్పోయింది. అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో శశాంక్ సింగ్ 2 సిక్సులు, ఓ ఫోర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు 176/6 పరుగులు చేసింది. 8 బంతుల్లోనే 21 పరుగులు చేసిన శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్(2) నాటౌట్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు.. యష్ దయాల్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీశారు.

Updated Date - Mar 25 , 2024 | 09:44 PM