Share News

Dattajirao Gaekwad: టీమిండియా అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:27 PM

దేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో 95 ఏళ్ల వయసులో బరోడాలోని తన నివాసంలో మరణించారు.

Dattajirao Gaekwad: టీమిండియా అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో 95 ఏళ్ల వయసులో బరోడాలోని తన నివాసంలో మరణించారు. ఇటీవల 12 రోజులపాటు దత్తాజీరావు ఐసీయూలో ఉన్నట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. 1952 నుంచి 1961 మధ్య 9 సంవత్సరాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గైక్వా్డ్ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 4 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1952లో లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి దత్తాజీరావు గైక్వాడ్ అరంగేట్రం చేశాడు. తన చివరి టెస్టును 1961లో చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో ఆడాడు. తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌లో దత్తాజీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు.


ఫస్ట్ క్లాక్ క్రికెట్‌లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దత్తాజీ 110 మ్యాచ్‌లాడి 36 సగటుతో 5788 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 249 నాటౌట్‌గా ఉంది. బౌలింగ్‌లో 25 వికెట్లు తీశాడు. 1947 నుంచి 1964 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. మొత్తం 17 ఏళ్లపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన దత్తాజీ బరోడా క్రికెట్ జట్టు ఎదుగుదలకు ఎనలేని కృషి చేశాడు. 2016లో 87 ఏళ్ల వయసులో టీమిండియా మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ మరణించాడు. ఆ తర్వాత భారతదేశపు అత్యంత పురాతన టెస్ట్ క్రికెటర్‌గా దత్తాజీరావు గైక్వాడ్ గుర్తింపు పొందాడు. కాగా దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఇక దత్తాజీరావు కొడుకు అన్షుమాన్ గైక్వాడ్ కూడా క్రికెటరే కావడం గమనార్హం. 1975 నుంచి 1987 మధ్య టీమిండియాకు 40 టెస్టులు, 15 వన్డేల్లో అన్షుమాన్ ప్రాతినిధ్యం వహించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 01:27 PM