Share News

IND vs ENG: నాలుగో టెస్టుకు బుమ్రా దూరం? ఐదో టెస్టుకు కూడా..

ABN , Publish Date - Feb 19 , 2024 | 11:54 AM

పలు నివేదికల ప్రకారం ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దూరంకానున్నాడు. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం.

IND vs ENG: నాలుగో టెస్టుకు బుమ్రా దూరం? ఐదో టెస్టుకు కూడా..

రాంచీ: పలు నివేదికల ప్రకారం ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దూరంకానున్నాడు. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. నాలుగో టెస్టు ఫలితాన్ని బట్టి ఐదో టెస్టుకు కూడా దూరం కావొచ్చని తెలుస్తోంది. గతేడాది ఆగష్టులో గాయపడిన బుమ్రా కోలుకోవడానికి ఏకంగా 11 నెలలు పట్టింది. దీంతో అప్పటి నుంచి బుమ్రాను బీసీసీఐ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. అతని మీద ఎక్కువ పని భారం పడకుండా చూస్తోంది. వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ నుంచి బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో వరుసగా 3 టెస్టులు ఆడిన బుమ్రా మీద వర్క్ లోడ్ తగ్గించే క్రమంలో నాలుగో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. టెస్ట్ సిరీస్ అనంతరం ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.


దీంతో రాజ్‌కోట్ టెస్ట్ ముగిసిన తర్వాత బుమ్రా నాలుగో టెస్టు వేదికైనా రాంచీ వెళ్లకుండా తన స్వస్థలం అయినా అహ్మదాబాద్ వెళ్లనున్నాడని సమాచారం. ఇప్పటివరకు ముగిసిన 3 టెస్టుల్లో 80 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 17 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఒకవేళ బుమ్రా నిజంగానే నాలుగో టెస్టుకు దూరమైతే అతని స్థానంలో ముఖేష్ కుమార్ లేదా నాలుగో స్పిన్నర్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా మరో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 11:54 AM