Share News

IND vs ENG: యశస్వీ జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు సెంచరీ

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:17 PM

మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపిన జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్సులతో 122 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు.

IND vs ENG: యశస్వీ జైస్వాల్ విధ్వంసం.. 9 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు సెంచరీ

రాజ్‌కోట్: మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపిన జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్సులతో 122 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్, అంతకుముందు హాఫ్ సెంచరీని సిక్సుతో పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. టెస్ట్ కెరీర్‌లో మూడోది. 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు మొదటి ఓవర్‌లోనే 9 పరుగులొచ్చాయి. జేమ్స్ అండర్సన్ వేసిన మొదటి ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అయితే 19 పరుగులు చేసిన రోహిత్ శర్మను 12వ ఓవర్‌లో రూట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 30 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం శుభ్‌మన్ గిల్‌తో జత కలిసిన యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన జైస్వాల్ క్రీజులో కుదురుకున్నాక గేర్ మార్చాడు.


అండర్సన్ వేసిన 27వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్సు, రెండు ఫోర్లు బాదాడు. టామ్ హార్ట్‌లీ వేసిన 28వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సులు బాదాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించిన జైస్వాల్ సెంచరీని అందుకున్నాడు. మొదట 73 బంతుల్లో 35 పరుగులతో ఆడిన జైస్వాల్.. ఆ తర్వాత 122 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత స్కోర్ 42 ఓవర్లలో వికెట్ నష్టానికి 172 పరుగులుగా ఉంది. దీంతో ఇంగ్లండ్‌పై టీమిండియా ప్రస్తుతం 298 పరుగుల భారీ అధిక్యంలో ఉంది. జైస్వాల్, గిల్ భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లండ్ ముందు భారత జట్టు భారీ లక్ష్యం ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓవర్‌నైట్ స్కోర్ 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టారు. రూట్(18)ను బుమ్రా, బెయిర్‌స్టోతోపాటు కీలకమైన డకెట్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా బెయిర్‌స్టోను డకౌట్ చేసిన కుల్దీప్.. కాసేపటికే భారీ సెంచరీతో చెలరేగుతున్న బెన్ డకెట్ (153)ను కూడా ఔట్ చేశాడు. శుక్రవారం నాటి తన స్కోర్‌కు డకెట్ మరో 18 పరుగులు మాత్రమే జోడించాడు. అయితే వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డకెట్ 23 ఫోర్లు, 2 సిక్సులతో 151 బంతుల్లోనే 153 పరుగులు చేశాడు. దీంతో 260 పరుగులకు ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ వికెట్లకు కాసేపు అడ్డుగా నిలిచారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 65వ ఓవర్లో రవీంద్ర జడేజా విడదీశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ చెలరేగాడు. ఆ వెంటనే ఫోక్స్(13)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 299 పరుగుల వద్దే ఇంగ్లండ్ 6, 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1)ను సిరాజ్.. టామ్ హార్ట్‌లీ(9)ను జడేజా ఔట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు.. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల భారీ అధిక్యం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 04:38 PM