Share News

IND vs ENG: అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో టీమిండియా పరిస్థితి ఏమిటి? రూల్స్ ఏం చెబుతున్నాయి..

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:16 PM

టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా సినియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.

 IND vs ENG: అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో టీమిండియా పరిస్థితి ఏమిటి? రూల్స్ ఏం చెబుతున్నాయి..

రాజ్‌కోట్: టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా సినియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో రెండో రోజు ఆట అనంతరం మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో మూడో రోజు ఆటలో అశ్విన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం అశ్విన్ లేకపోవడంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అశ్విన్ స్థానంలో మరో బౌలర్‌ను ఆడించొచ్చా.. లేదంటే రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి ఉంటుందా? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.


ఎంసీసీ నిబంధనలు 24.1.2 ప్రకారం.. ఒక ఆటగాడు మ్యాచ్ మధ్యలో గాయపడి లేదా అనారోగ్యానికి గురై మిగతా మ్యాచ్‌కు దూరమైతే అంపైర్ అనుమతితో అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను తీసుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జట్టులోకి వచ్చిన ఆటగాడు ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. అవసరమైతే అంపైర్ అనుమతితో వికెట్ కీపింగ్ చేయొచ్చు. కానీ బౌలింగ్, బ్యాటింగ్ చేసేందుకు అనుమతి లేదు. అంటే ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను మాత్రమే అనుమతిస్తారు. కానీ పూర్తిగా ఆటగాడినే భర్తీ చేయడానికి వీల్లేదు. అయితే ఒక వేళ కంకషన్ లేదా కోవిడ్ 19 పాజిటివ్ కారణంగా ఆటగాళ్లు మ్యాచ్ మధ్యలో నుంచి తప్పుకుంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం అతని స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేయవచ్చు. 1.2.2 నిబంధనల ప్రకారం ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

నిబంధనల ప్రకారం ఆట మధ్యలో ఆటగాడు గాయపడి మ్యాచ్ మొత్తానికి దూరమైతే అతని స్థానంలో కొత్త ప్లేయర్‌ను తీసుకోవడాన్ని కంకషన్ అంటారు. అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ అశ్విన్ అలా వెళ్లలేదు. దీంతో భారత జట్టు కంకషన్‌ను ఉపయోగించుకునే అవకాశం లేదు. అయితే ఒక వేళ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును టీమిండియా అభ్యర్థన చేసుకుంటే, ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒప్పుకుంటే అశ్విన్ స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేయవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 322 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.

Updated Date - Feb 17 , 2024 | 07:16 PM