Share News

IND vs ENG: తప్పు నాదే.. సర్ఫరాజ్ ఖాన్‌కు క్షమాపణ చెప్పిన జడేజా

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:12 PM

ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌కు రవీంద్ర జడేజానే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు.

IND vs ENG: తప్పు నాదే.. సర్ఫరాజ్ ఖాన్‌కు క్షమాపణ చెప్పిన జడేజా

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌కు రవీంద్ర జడేజానే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయిన సమయంలో డగౌట్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కోపంతో తలపైన ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. సోషల్ మీడియాలో జడేజాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన వెంటనే రవీంద్ర జడేజా స్పందించాడు. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. ఇందుకుగానూ అతనికి క్షమాపణలు కూడా చెప్పాడు. అలాగే సర్ఫరాజ్ బాగా ఆడాడని ప్రశసించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా జడ్డూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘సర్ఫరాజ్ ఖాన్ పట్ల బాధగా ఉంది. తప్పు నాదే. నువ్వు బాగా ఆడావు’’ అని రాసుకొచ్చాడు.


కాగా సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సర్ఫరాజ్ ఖాన్.. క్రికెట్‌లో రనౌట్లు సహజమని అన్నాడు. అలాగే జడేజా కారణంగానే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగానని చెప్పాడు. "బ్యాటింగ్ సమయంలో జడేజా నన్ను గైడ్ చేశాడు. క్రీజులో కొంత సమయం గడపమని చెప్పాడు. ఆ తర్వాత పరుగులు అవే వస్తాయని చెప్పాడు. మ్యాచ్ అయిపోయాక జడేజా నా వద్దకు వచ్చి తన వల్ల కొంచెం తప్పు జరిగిందని చెప్పాడు. నేను కూడా దానిని ఓకే చేశాను" అని సర్ఫరాజ్ చెప్పాడు. అసలేం జరిగిందంటే.. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆడుతున్నది మొదటి మ్యాచే అయినప్పటికీ ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ధాటిగా ఆడి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ దూకుడు చూస్తుంటే సెంచరీ కొట్టేవాడిలానే కనిపించాడు. కానీ జేమ్స్ అండర్సన్ వేసిన 82వ ఓవర్ ఐదో బంతికి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటికే 99 పరుగులతో ఉన్న జడేజా ఆ బంతికి పరుగు తీసి సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించాడు. బంతి కాస్త దూరం వెళ్లడంతో పరుగు కోసం క్రీజు నుంచి బయటకు పరిగెత్తాడు. సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పరుగు కోసం పిలిచాడు. అది చూసి సర్ఫారాజ్ ఖాన్ కూడా పరిగెత్తాడు. కానీ ఇంతలోనే బంతి ఫీల్డర్ మార్కు వుడ్ చేతిలోకి వెళ్లింది. ఇది గమనించిన జడేజా వెంటనే మనసు మార్చుకుని వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కూడా వెనక్కి వెళ్లబోయాడు. కానీ అప్పటికే మార్కు వుడ్ డైరెక్ట్ త్రోతో స్టంప్స్‌ను కొట్టాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఈ షాకింగ్ ఘటనతో డగౌట్‌లోని టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందితోపాటు స్టేడియంలోని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Updated Date - Feb 15 , 2024 | 09:12 PM