Share News

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

ABN , Publish Date - May 26 , 2024 | 04:47 PM

ఆగి ఉన్న బస్సును ముందు నుంచి వస్తున్న డంపర్ ఢీకొట్టడంతో డంపర్‌పై బస్సు ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో(Road Accident) 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

లఖ్‌నవూ: ఆగి ఉన్న బస్సును ముందు నుంచి వస్తున్న డంపర్ ఢీకొట్టడంతో డంపర్‌పై బస్సు ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో(Road Accident) 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షాజహాన్‌పుర్ ఖుతార్ పట్టణంలోని తికునియా నుంచి గోలా వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ ధాబా ఉంది. లఖింపుర్ ఖేరీ నుంచి ఓ ప్రైవేట్ బస్సు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ధాబా వద్ద ఆగింది.

కొంత మంది బస్సు దిగి భోజనం చేసేందుకు వెళ్లగా చాలా మంది ప్రయాణికులు బస్సులోనే కూర్చున్నారు. అదే సమయంలో ఖుతార్ నుంచి వస్తున్న బ్యాలస్ట్ లోడ్ అయిన డంపర్ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత డంపర్ బస్సుపై పడింది. ప్రమాద సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో దాదాపు 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.


క్షతగాత్రులను వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితులంతా సిధౌలిలోని కమ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జాతా గ్రామానికి చెందిన వారని.. పూర్ణగిరి మాతను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.

మృతుల్లో మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో అక్కడంతా భయానక వాతావరణం నెలకొంది. క్రేన్ సాయంతో డంపర్‌ని తీయడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ఘటనపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 04:48 PM