Share News

National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు

ABN , Publish Date - May 20 , 2024 | 06:00 AM

నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్‌ జరిగే దశ ఇదే.

National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు

  • నేడే సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌.. రాహుల్‌, స్మృతి, రాజ్‌నాథ్‌తదితర హేమాహేమీలు బరిలో

  • ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ.. 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష

న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్‌ జరిగే దశ ఇదే. ఈసారి కేవలం 49 స్థానాలకే ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఆ స్థానాలు ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించడం, పలువురు హేమాహేమీలు బరిలో ఉండడం రాజకీయప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ, అమేఠీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజధాని లఖ్‌నవూ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, శరణ్‌ (బిహార్‌)లో బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, హాజీపూర్‌లో రాంవిలాస్‌ పాసవాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ వంటివారు ఈ దశలో పోటీపడుతున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు.

ఈ 49 స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీ సాగుతుండడంతో ఐదో దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు.


రాహుల్‌ గతంలో పోటీ చేసిన అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్‌ శర్మ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢీకొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ కూటమి రాజకీయంగా బలం పుంజుకున్న రీత్యా ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాక ఎన్నికలు జరుగుతున్న 14 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి. ఇక, మహిళా అథ్లెట్‌లపై లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు ఈసారి కైసర్‌గంజ్‌ నుంచి బీజేపీ టికెట్‌ ఇవ్వకుండా ఆయన కుమారుడిని రంగంలోకి దించింది. అయోధ్య రామమందిరం కొలువై ఉన్న ఫైౖజాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత లల్లూ సింగ్‌, ఎస్పీ నేత అవధేశ్‌ ప్రసాద్‌ మధ్య పోటీ బలంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లఖ్‌నవూలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎస్పీ నేత రవిదాస్‌ మెర్హోత్రా మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

  • మరాఠా గడ్డపై...

అయిదో దశలో బీజేపీకి అత్యంత కీలకమైన మహారాష్ట్రలో 14 స్థానాల్లో కమలనాథులకు ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోనే కనీసం ఏడు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండుగా చీలిపోయిన శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలలో ఎవరిది నిజమైన పార్టీగా ప్రజలు గుర్తిస్తారో ఈ ఎన్నికలలో తేలనుంది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సహా పలువురు బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కాగా, ఈ దశలో బిహార్‌లో 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్య.. బీజేపీ దిగ్గజం రాజీవ్‌ ప్రతాప్‌ రూడీకి గట్టి పోటీ ఇస్తున్నారు. లోక్‌జనశక్తి నేత చిరాగ్‌ పాసవాన్‌ హాజీపూర్‌లో ఎన్డీయే తరఫున పోటీ చేస్తుండగా..

ఆయన ప్రత్యర్థిగా లాలూ కుడిభుజం శివ చంద్రరామ్‌ బరిలో ఉన్నారు. అలాగే.. జార్ఖండ్‌లో సోమవారం ఎన్నికలు జరగనున్న హజారీబాగ్‌, కొడెర్మా, ఛత్రా సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. హజారీబాగ్‌లో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హా గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఈసారి బీజేపీ ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న గాండే అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ జేఎంఎం నుంచి పోటీ చేస్తుండగా ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ దిలీప్‌ వర్మ అనే స్థానికుడిని రంగంలోకి దింపింది.


రాష్ట్రం స్థానాలు

ఝార్ఖండ్‌ 3

ఒడిశా 5

ఉత్తరప్రదేశ్‌ 14

బిహార్‌ 5

మహారాష్ట్ర 13

పశ్చిమబెంగాల్‌ 7

లద్దాఖ్‌ 1

జమ్ముకశ్మీర్‌ 1

  • తూర్పు తీరాన..

పశ్చిమబెంగాల్‌లో అత్యంత కీలకమైన హూగ్లీ, హౌరా, ఆరాంబాగ్‌, సేరంపూర్‌, బంగాన్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌- బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఆ రాష్ట్రంలో 57.19 శాతం పైగా పోలింగ్‌బూత్‌లను సున్నితమైనవిగా ఈసీ గుర్తించడంతో అక్కడ భారీగా కేంద్ర బలగాలను దించారు. ఇటు ఒడిసాలో ఐదో దశలో పోలింగ్‌జరిగే 5 స్థానాలనూ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతల్లో 13 మంది కోట్లకు పడగెత్తినవారేనని ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది.ఇక జమ్ముకశ్మీర్‌లో బారాముల్లా నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరఫున మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బరిలో ఉన్నారు.

Updated Date - May 20 , 2024 | 06:02 AM