Share News

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 08:50 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది. రాహుల్ నాయకత్వాన్ని జాతీయ మీడియాతోపాటు, అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసిస్తోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీ మార్కును చేరకపోవడం.. ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఒక్కసారిగా రాహుల్ పేరు మార్మోగుతోంది.

ప్రస్తుతం చాలా మంది ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తేవాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై మహారాష్ట్ర శివసేన(యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు. రాహుల్ ఒక వేళ ప్రధాని అభ్యర్థిత్వానికి అంగీకరిస్తే తాము అభ్యంతరం చెప్పబోమని, ఆయన నాయకత్వ పటిమ బయటపడిందని, ప్రజాదరణ పొందిన నేతల్లో రాహుల్ ఒకరని, కూటమి ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంజయ్ పేర్కొన్నారు.


రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సంజయ్ పై విధంగా స్పందించారు. 'ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచే ఇండియా కూటమికి ప్రధాని పదవిపై ఎలాంటి విభేదాలు లేవు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మా కూటమి ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. ప్రజలు మాకు పట్టం కట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షా బీజేపీ ఓటమిని అంగీకరించాలి" అని సంజయ్ అన్నారు.


బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్(యునైటెడ్), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA)కి మద్దతు ఇవ్వడాన్ని బలహీనతకు రెండు స్తంభాలుగా అభివర్ణించారు. టీడీపీ, జేడీ(యూ) అనే రెండు స్తంభాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ గౌరవాన్ని కోల్పోయారని, అలాంటి ప్రధాని ప్రజలకు అక్కర్లేదని రౌత్ అన్నారు. నితీశ్, బాబు ఎప్పుడు ఇండియా కూటమికి మద్దతు ప్రకటించినా వారిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారిరువురు నియంతృత్వానికి మద్దతు ఇస్తారని అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 08:50 AM