Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో విస్తుగొలిపే నిజాలు.. అసెంబ్లీ ఎన్నికలపైనా కన్ను!
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:11 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము ఉగ్రదాడి వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని
![Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో విస్తుగొలిపే నిజాలు.. అసెంబ్లీ ఎన్నికలపైనా కన్ను!](https://media.andhrajyothy.com/media/2024/20240604/Bus_Terror_Attack_3824ee5efb.jpg)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము ఉగ్రదాడి (Jammu Terror Attack) వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఖైగల్ గ్రామంలో ఈ ఉగ్రదాడికి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఆ గ్రామంలో 300 నుంచి 400 మంది జిహాదీలు సమావేశం అయ్యారని.. ఆ భేటీలో భారత్పై భారీ స్థాయిలో దాడులు జరపాలని పిలుపునిచ్చారని తేలింది. ఐఎస్ఐ (ISI) ఆదేశాల మేరకే ఈ సమావేశం జరిగిందని.. ఇందులో జైషే మహ్మద్, లష్కరే తోయిబాలతో పాటు జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF)కి సంబంధించిన ముష్కరులు పాల్గొన్నారని వెల్లడైంది.
ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. భారత్పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థలను నెలకొల్పుతోందని సమాచారం. స్థానిక యువకుల్ని బ్రెయిన్వాష్ చేసి.. వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దర్యాప్తు సంస్థల సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఐఎస్ఐ కన్నేసిందట. ఈ ఎన్నికల టైంలో దాడులు జరిపితే అల్లకల్లోల వాతావరణం నెలకొంటుందని ఐఎస్ఐ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే.. భద్రతా బలగాలు రంగంలోకి దిగి, ఉగ్రవాదుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు డ్రోన్లతో గాలిస్తున్నారు.
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి
ఇదిలావుండగా.. జమ్ముకశ్మీర్లోని రియాసిలో జూన్ 9వ తేదీన శివఖోడి నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అన్ని వైపులా నుంచి వాళ్లు కాల్పులు జరపడంతో.. డ్రైవర్కి బుల్లెట్ తగిలింది. దీంతో.. బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. అప్పటికీ ఉగ్రవాదులు విడిచిపెట్టకుండా.. అటుగా వెళ్లి మళ్లీ 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది యాత్రికులు చనిపోగా.. 33 మంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు.. కాల్పుల సమయంలో చనిపోయినట్లు నటించినట్లు తెలిపారు. ఈ దాడి చేసింది తామేనని లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
Read latest National News and Telugu News