Share News

PM Modi: ఉమెన్స్ డే సందర్భంగా దేశ ప్రజలకు మోదీ గుడ్ న్యూస్..

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:56 AM

ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన కొన్ని గంటలకే మరో గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

PM Modi: ఉమెన్స్ డే సందర్భంగా దేశ ప్రజలకు మోదీ గుడ్ న్యూస్..

ఢిల్లీ: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పిన కొన్ని గంటలకే మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు పీఎం మోదీ (PM Modi) ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇవాళ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.100 తగ్గిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

ఎల్పీజీ సిలిండర్‌పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగిస్తున్నట్టు నిన్న కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నాడు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్చి 7, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పీఎంయూవై లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఏడాదికి 12 రీఫిల్స్‌కు అందించడం జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మార్చి 1, 2024 నాటికి 10.27 కోట్లకు పైగా PMUY లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ. 200 నుంచి రూ. 300 పెంచింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ కొనసాగింపు కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 12,000 కోట్లు వ్యయం అవుతుందన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 10:00 AM