Share News

Khushboo, Nirmala Sitharaman: చెన్నైలో ఖుష్బూ, పాండీలో నిర్మలా సీతారామన్‌ పోటీ?

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:08 AM

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున 25 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాలని, వారిలో ప్రజలకు సుపరిచితులైన, వాగ్ధాటి కలిగిన మహిళామణులను పోటీకి దించాలని బీజేపీ(BJP) అధిష్ఠానం నిర్ణయించింది.

Khushboo, Nirmala Sitharaman: చెన్నైలో ఖుష్బూ, పాండీలో నిర్మలా సీతారామన్‌ పోటీ?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున 25 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాలని, వారిలో ప్రజలకు సుపరిచితులైన, వాగ్ధాటి కలిగిన మహిళామణులను పోటీకి దించాలని బీజేపీ(BJP) అధిష్ఠానం నిర్ణయించింది. ఆ మేరకు బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సినీ నటి ఖుష్బూను దక్షిణ చెన్నై లోక్‌సభ నియోజకవర్గంలో, ఇక పుదుచ్చేరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధమైంది.

ఎన్నికల కార్యాలయాలు....

అభ్యర్థుల ఎంపిక కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తుండడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. ఇటీవల తిరునల్వేలిలో ప్రారంభించారు. తాజాగా వేళచ్చేరి రామ్‌నగర్‌ ఆరవ మెయిన్‌రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ శాసనసభ్యురాలు వానతి శ్రీనివాసన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరు నాగరాజన్‌, కరాటే త్యాగరాజన్‌, భాస్కర్‌, కాళిదాస్‌, సాయి సత్యన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల కార్యాలయం దక్షిణ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి అప్పుడే సీనియర్‌ నాయకులు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రకారం దక్షిణ చెన్నైలో పోటీకి కరు నాగరాజన్‌, తిరుపతి నారాయణ్‌, రమే్‌షశివా, ఎస్‌జీ సూర్యా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే అధిష్ఠానం ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు బాగా పరిచయమున్న వ్యక్తులను, ప్రత్యేకించి సినీ నటీనటులను, ప్రముఖులను పోటీకి దింపాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే దక్షిణ చెన్నైలో నటి ఖుష్బూ(Khushboo)ను పోటీ చేయించాలని భావిస్తోంది. ఈ విషయమై ఖుష్బూ మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ఎంపిక చేశారో లేదో తనకు తెలియదని చెప్పారు. ఈసారి రాష్ట్రం నుంచి ఎన్డీయే ఎంపీలు అధిక సంఖ్యలో గెలిపించడానికి కృషి చేస్తానన్నారు.

పుదుచ్చేరిలో...

పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్టీయే కూటమి తరఫున పోటీకి మహిళా ప్రముఖులు పలువురు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ ఈ సారి లోక్‌సభ ఎన్నికలల్లో పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. ఆమెకు పార్టీ టికెట్‌ లభిస్తే పుదుచ్చేరినే ఎంపిక చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్టు ఢిల్లీ నుంచి రాష్ట్ర కమిటీ నాయకులకు వర్తమానం అందింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయానికి తీవ్రంగా పాటుపడిన ఎన్నికల ఇన్‌చార్జి నిర్మల్‌కుమార్‌ సురానా లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇన్‌చార్జిగా నియమితులవడంతో పార్టీ శ్రేణులు హర్షం ప్రకటిస్తున్నారు.

ఊహించని అభ్యర్థి...

నిర్మల్‌ కుమార్‌ సురానా ఇటీవల పార్టీ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడుతూ... పుదుచ్చేరి నియోజకవర్గంలో ఎవరూ ఊహించని అభ్యర్థి పోటీ చేయనున్నారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరును పరోక్షంగా ప్రస్తావించారు. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్‌ కూడా పుదుచ్చేరిలో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా పుదుచ్చేరిలో పనిచేసున్న అటవీశాఖకు చెందిన సీనియర్‌ అధికారి కూడా బీజేపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్న తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ సారి పుదుచ్చేరిలో, చెన్నైలో మహిళా అభ్యర్థులు బరిలోకి దిగడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:08 AM