Share News

Modi Vs Kejriwal: దశాబ్దం నుంచి ఆధిపత్య పోరు.. ఇక ముగిసినట్టేనా!

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:41 AM

దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో తలొంచారు.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవని సర్దుకున్నారు..

Modi Vs Kejriwal: దశాబ్దం నుంచి ఆధిపత్య పోరు.. ఇక ముగిసినట్టేనా!

  • పదేళ్లుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్సెస్‌ బీజేపీ

  • ప్రధాని మోదీని గట్టిగా ఢీకొన్న కేజ్రీవాల్‌

  • పలు రాష్ట్రాల్లో కమలానికి కంట్లో నలుసు

  • కేజ్రీవాల్‌ అరెస్టుతో తుది అంకానికి చేరిక

న్యూఢిల్లీ, మార్చి 21: దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో తలొంచారు.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవని సర్దుకున్నారు..! కానీ, కేజ్రీ మాత్రం గట్టిగా ఢీకొట్టారు. తన ఆమ్‌ అద్మీ పార్టీని పంజాబ్‌, గుజరాత్‌, గోవా వంటి రాష్ట్రాలకు విస్తరించి జాతీయ పార్టీ స్థాయికి ఎదగడమే కాక, మోదీ విధానాలను ఎండగడుతూ బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మినహా మోదీకి ఈ స్థాయిలో ఎదురునిలిచింది కేజ్రీవాలే కావడం గమనార్హం. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన అరెస్టు ద్వారా ఇరు పార్టీల వైరం పతాక స్థాయికి చేరినట్తైంది. మోదీ నాయకత్వంలో బీజేపీ 2014 ఎన్నికల్లో కేంద్రంలో కొలువుదీరింది. ఆ తర్వాత కొద్ది నెలలకే 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లకు గాను 67 నెగ్గి కేజ్రీవాల్‌ చారిత్రక విజయం నమోదు చేశారు. దీనికిముందే 2013లో ఆయన స్వల్పకాలం సీఎంగా పనిచేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో వారాణసీలో మోదీపై పోటీకి దిగి వార్తల్లో నిలిచారు. 2019లో మోదీ మరోసారి విజయం సాధించగా, 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీ గెలుపొందారు. ఇన్నేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ అభిప్రాయ భేదాలతో వీరి వైరం పెరుగుతూనే పోయింది. ఒక్కో ఎమ్మెల్యేను రూ.25 కోట్లకు కొనుగోలు చేయాలని చూసిందని, పార్టీని చీల్చే కుట్రలకు పాల్పడిందని, కేజ్రీని జైలుకు పంపి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిందనేది బీజేపీపై ఆప్‌ ఆరోపణలు కాగా, ఆప్‌, కేజ్రీ అవినీతిని బీజేపీ ఎత్తిచూపేది.

2Modi.jpg

అలా మొదలైంది..

ఇక అధికారుల బదిలీలు, పోలీస్‌, భూమి విషయాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)కు అధికారం కట్టబెడుతూ 2015లో కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిపికేషన్‌ కేంద్రం, ఆప్‌ సర్కారు మధ్య మొదలైన తొలి ఘర్షణగా చెబుతారు. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘ నాయ్య పోరాటానికి దారితీసింది. నిరుడు మే 11న సీనియర్‌ అధికారుల బదిలీ, పోస్టింగ్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పునిచ్చింది. ఆ కొద్ది రోజులకే ఎల్జీ-ప్రభుత్వం మధ్య అధికార సమతుల్యతను పాటిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను తెచ్చింది. నిరుడు ఆగస్టులో నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ గవర్నమెంట్‌ (సవరణ) చట్టం ద్వారా ఎల్జీకి కేంద్రం అధికారాలను కట్టబెట్టాలని చూసింది.

kejriwal.jpg

ఎల్జీలతో లడాయి..

కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్‌ గవర్నర్ల (ఎల్జీ)తో ఆప్‌ సర్కారుకు తొలి నుంచి పొసగలేదు. నజీబ్‌ జంగ్‌ ఎల్జీగా ఉన్న సమయంలో.. చీఫ్‌ సెక్రటరీ నియామకం, అవినీతి నిరోధక శాఖపై నియంత్రణ, సీనియర్‌ అధికారుల బదిలీ, పోస్టింగ్‌లు, ఫైల్స్‌పై సంతకాల విషయంలో ఆప్‌ గట్టిగానే నిలదీసింది. దీంతో 400 ఫైల్స్‌ పరిశీలనకు మాజీ కాగ్‌ షుంగ్లూ సహా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. జంగ్‌ వెళ్లిపోయారు అనుకుంటే, ఆయన స్థానంలో వచ్చిన అనిల్‌ బైజాల్‌తో కేజ్రీ సర్కారు ఇంకా గట్టిగా తలపడాల్సి వచ్చింది. బైజాల్‌ కారణంగా అధికారులు తమ మాట వినడం లేదంటూ కేజ్రీ మంత్రులతో కలిసి రాజ్‌ నివాస్‌ ఎదుటనే ధర్నాకు దిగే స్థాయికి చేరింది. సీఏఏ వ్యతిరేక అల్లర్లపై స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రభుత్వ నిధుల వ్యయం ఇలా చాలా అంశాల్లో బైజాల్‌-ఆప్‌ సర్కారు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 2022 మేలో ఎల్జీగా వచ్చిన వీకే సక్సేనా మొత్తం వ్యవహారాన్ని మలుపుతిప్పారు. బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే.. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలోని అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. తర్వాత మనీ ల్యాండరింగ్‌పై ఈడీ రంగంలోకి దిగి ఆప్‌ మంత్రి మనీశ్‌ సిసోడియా, ఎంపీ సంజయ్‌సింగ్‌లను అరెస్టు చేసింది. లిక్కర్‌ స్కాంతో పాటు ఢిల్లీ జల మండలి కేసులోనూ కేజ్రీకి పదేపదే సమన్లు జారీ చేసింది. గురువారం చివరకు కేజ్రీవాల్‌ అరెస్టు జరిగింది.

Updated Date - Mar 22 , 2024 | 08:54 AM