Delhi: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ను వెతుక్కోవాల్సిందే: షా
ABN , Publish Date - May 03 , 2024 | 03:14 AM
రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర చివరకు కాంగ్రెస్ అన్వేషణ యాత్రగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర చివరకు కాంగ్రెస్ అన్వేషణ యాత్రగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ఊసే ఎక్కడా వినిపించలేదని, మొత్తం ఎన్నికలు పూర్తయ్యాక ఆ పార్టీ ఎక్కడుందో వెతుక్కుంటూ రాహుల్ యాత్ర చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్లోని బరైలీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో, అలాగే, ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సంప్రదాయ ఓటు బ్యాంకు దూరమవుతుందన్న భయంతోనే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, అఖిలేశ్ యాదవ్ హాజరు కాలేదని దుయ్యబట్టారు. యూపీ సీఎం కావాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, రాహుల్ను ప్రధాని చేయాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా భావిస్తున్నారని.. కానీ, వారి కలలు కల్లలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.