Share News

Lok Sabha Polls: నవీన్ పట్నాయక్‌‌ బీజేడీతో బీజేపీ పొత్తు..?

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:32 PM

లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్‌తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Lok Sabha Polls: నవీన్ పట్నాయక్‌‌ బీజేడీతో బీజేపీ పొత్తు..?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls) వేళ నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశా(Odisha)లో బిజూ జనతాదళ్ (BJD)తో పొత్తులకు బీజేపీ (BJP) పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఒక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని, బీజేడీ 11, బేజీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.


జేడీయూపై విమర్శలకు దూరంగా మోదీ ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు ఒడిశాలో పర్యటన సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చెప్పారు. వికసిత్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్‌కు గేట్‌వేగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒడిశాలో గత పదేళ్లుగా కేంద్ర భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్రంలోని ఒక్క పెట్రో కెమికల్ సెక్టార్‌లోనే రూ.2 లక్షల కోట్లు వెచ్చించామన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడమేనని చెప్పారు. 'ఇండియా' బ్లాక్ పార్టీల సిద్ధాంతం కుటుంబ సిద్ధాంతమని, మోదీ ఐడియాలజీ మాత్రం 'నేషన్ ఫస్ట్' అని చెప్పారు. తన ప్రసంగంలో ఎక్కడా బిజూ జనతాదళ్‌ను కానీ, నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించలేదు. బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 06:32 PM