Share News

Bangalore: ఎన్నికలవేళ కాంగ్రెస్‏కు బిగ్ షాక్‌.. పార్టీకి సీఎం ఆప్తుడు గుడ్‌బై

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:37 PM

సీఎం సిద్దరామయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మైసూరు జిల్లాలో ఎన్నికల వేళ కాంగ్రెస్‏కు షాక్‌లు తగులుతున్నాయి. సీఎంకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన గురుపాదప్ప పార్టీకి గుడ్‌బై చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గం వరుణలో లింగాయత్ సమాజానికి చెందిన గురుపాదప్ప ప్రతిభావంతమైన వ్యక్తి. చాముండేశ్వరితో పాటు మైసూరు, చామరాజనగర్‌(Mysore, Chamarajanagar) జిల్లాలోను ఆయన ప్రభావం ఉంది.

Bangalore: ఎన్నికలవేళ కాంగ్రెస్‏కు బిగ్ షాక్‌.. పార్టీకి సీఎం ఆప్తుడు గుడ్‌బై

బెంగళూరు: సీఎం సిద్దరామయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మైసూరు జిల్లాలో ఎన్నికల వేళ కాంగ్రెస్‏కు షాక్‌లు తగులుతున్నాయి. సీఎంకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన గురుపాదప్ప పార్టీకి గుడ్‌బై చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గం వరుణలో లింగాయత్ సమాజానికి చెందిన గురుపాదప్ప ప్రతిభావంతమైన వ్యక్తి. చాముండేశ్వరితో పాటు మైసూరు, చామరాజనగర్‌(Mysore, Chamarajanagar) జిల్లాలోను ఆయన ప్రభావం ఉంది. కొన్నేళ్ళకాలంగా కాంగ్రెస్‏కు విశ్వాసం కలిగిన నాయకుడిగా వ్యవహరించారు. ఆయనను బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర ఏకంగా ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరినట్లు అయ్యింది. గురుపాదప్ప మైసూరు లోక్‌సభ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ అధికార ప్రతినిథిగా వ్యవహరిస్తున్న ఎం.లక్ష్మణ్‌కు టికెట్‌ కేటాయించిన తర్వాత పోటీలో ఉండే వారి పట్ల కనీస రీతిలో కూడా చర్చించకపోవడమే ఆయన ఆగ్రహానికి కారణమని తెలస్తోంది.

ఇదే విషయమై గురుపాదప్ప మీడియాతో మాట్లాడుతూ మైసూరు టికెట్‌ కోసం ప్రయత్నించామని అందరికీ టికెట్‌ ఇవ్వలేరని కానీ ప్రయత్నించిన వారితో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మాటమాత్రంగా కూడా చర్చించలేదన్నారు. గట్టిగా మాట్లాడేవారికే గౌరవమా అంటూ ప్రశ్నించారు. 45 ఏళ్ళుగా కాంగ్రెస్‏లోనే ఉన్నానని కానీ తమ పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతకాలం సహించాలన్నారు. ఇదే కారణంతోనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కాగా చామరాజనగర్‌ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ శ్రీనివాసప్రసాద్‌ అల్లుడికి టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఇదే అవకాశంగా భావించిన మంత్రి మహదేవప్ప కుమారుడు అభ్యర్థి సునిల్‌బోస్‏తో కలిసి నేరుగా ఎంపీ ఇంటికి వెళ్ళి ఆశీస్సులు పొందారు. ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అయితే ఎటువంటి సమాధానం చెప్పకపోయినా శ్రీనివాసప్రసాద్‌ కాంగ్రెస్‏లో చేరుతారనే ప్రచారం సాగింది. ఆయన మద్దతు ఇస్తే చామరాజనగర్‌లో సునాయాసంగా గెలుపు సాధించవచ్చునని కాంగ్రెస్‌ నాయకులు భావించారు. కానీ శ్రీనివాసప్రసాద్‌ మాత్రం బీజేపీ ఎంపీగా ఉన్నానని మరొకరికి మద్దతు ఇవ్వలేనని తేల్చిచెప్పారు. బీజేపీ టికెట్‌ ఇవ్వడంతో పాటు పలు సందర్భాల్లో ప్రత్యేక గౌరవం ఇచ్చిందని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దీంతో శ్రీనివాసప్రసాద్‌ మద్దతు లభించలేదు.

ఇదికూడా చదవండి: Actress Radhika: ఎన్నికల ప్రచారంలో.. నటి రాధిక నోట తెలుగు పలుకులు..

Updated Date - Apr 12 , 2024 | 01:44 PM