Share News

Tickets Cancelled: రైల్వే కొంపముంచిన పొగమంచు.. వేల టికెట్లు క్యాన్సల్.. కోట్లలో నష్టం

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:39 AM

ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు రైల్వే శాఖ కొంపముంచింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలి గాలుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో రైల్వే భారీగా నష్టపోయింది.

Tickets Cancelled: రైల్వే కొంపముంచిన పొగమంచు.. వేల టికెట్లు క్యాన్సల్.. కోట్లలో నష్టం

ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు రైల్వే శాఖ కొంపముంచింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలి గాలుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో రైల్వే శాఖ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. ఈ కారణాలతో రైలు ప్రయాణికులు ఒక్క డిసెంబర్ నెలలోనే రిజర్వేషన్ చేసుకున్న 20 వేల టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో రైల్వే శాఖకు ఏకంగా రూ.1.22 కోట్ల నష్టం వాటిల్లింది. మొరాదాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) రాజ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు దాదాపు రూ.1.22 కోట్లు తిరిగి వచ్చాయి. మొత్తం రద్దు చేసుకున్న టికెట్లలో అత్యధికంగా బరేలీకి చెందినవే 4,230 ఉన్నాయి.


ఆ తర్వాత హరిద్వారా ప్రయాణానికి సంబంధించిన 3,917 టికెట్లు, మొరాదాబాద్‌ ప్రయాణానికి సంబంధించిన 3,239 టికెట్లు, డెహ్రాడూన్ ప్రయాణానికి సంబంధించిన 2,448 టికెట్లు రద్దయ్యాయి. "పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను మేము రద్దు చేసాము. 2023 డిసెంబర్‌లో మొరాదాబాద్ డివిజన్‌లో 20,000 టిక్కెట్లు రద్దు అయ్యాయి. మార్చి వరకు 42 రైళ్లు రద్దు అయ్యాయి. మేము ప్రయాణికులకు రూ.1.22 కోట్లను తిరిగి చెల్లించాం.’’ అని రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా తీవ్ర చలి గాలులు, దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారాక కూడా పొగమంచు తొలగకపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 08:39 AM