Share News

PM Modi: మతి లేకే ఆ మాటలు!

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:44 AM

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారాణసీలో..

PM Modi: మతి లేకే ఆ మాటలు!

  • నా వారాణసీ బిడ్డలను తాగుబోతులంటారా?

  • కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ ధ్వజం

వారాణసీ, ఫిబ్రవరి 23: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారాణసీలో శుక్రవారం రూ.13 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు, సంత్‌ రవిదాస్‌ జయంతి పాల్గొన్న ఆయన.. బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు. వారాణాసీలో కొందరు మద్యం తాగి రోడ్డుపై పడి ఉండడాన్ని చూశానంటూ రాహుల్‌ ఇటీవల చేసిన వాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇదేం భాష? అని ప్రశ్నించారు. ‘నా వారాణసీ బిడ్డలను తాగుబోతులని అంటారా? వారి సొంతగడ్డపైనే కాంగ్రెస్‌ యువరాజు వారాణసీ యువతను అవమానించారు. మతిలేని వారి నుంచే ఇలాంటి మాటలు వస్తాయి. 20 ఏళ్లుగా వారు నన్ను దూషిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అసహనం అంతటినీ యూపీ యువతపై చూపుతున్నారు. ఈ అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను’ అంటూ నిప్పులు చెరిగారు. యువత ప్రతిభను చూసి కుటుంబ పార్టీల నాయకులు తట్టుకోలేక.. వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. కులతత్వంతో రెచ్చగొట్టడాన్నే ఇండియా కూటమి పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఐదేళ్లలో భారత్‌ను అభివృద్ధి చిహ్నంగా మారుస్తానని, దానికి గ్యారెంటీ ఇస్తున్నాని చెప్పారు.

రాత్రి వేళ రోడ్‌ షో.. ఆకస్మిక తనిఖీ

మోదీ గురువారం రాత్రే వారాణసీ చేరుకున్నారు. ఆ వెంటనే రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఇటీవల ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రధాని పరిశీలించారు. అర్థరాత్రి వేళ శివ్‌పుర్‌-పుల్వారియా-ల్‌హరత్రా మార్గ్‌ను యూపీ సీఎం యోగితో కలిసి తనిఖీ చేశారు. ఈ ఫొటోలను మోదీ ‘‘ఎక్స్‌’’లో పోస్ట్‌ చేశారు. కాగా, రూ.360 కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు వినియోగంలోకి రావడంతో బనారస్‌ యూనివర్సిటీ నుంచి వారణసీ విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రయాణ సమయం సగం మేర తగ్గనుంది.

Updated Date - Feb 24 , 2024 | 07:46 AM