Share News

Hyderabad: పార్సిల్‌ పేరుతో బెదిరింపులు.. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు

ABN , Publish Date - May 11 , 2024 | 10:47 AM

నగరంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో నెల రోజుల క్రితం వరకు నమోదైన కేసుల్లో సరాసరి మొత్తం రోజుకు రూ. 1.50 కోట్లు కాగా, ఈనెల ప్రారంభం నుంచి నమోదవుతున్న కేసుల్లో ప్రతి రోజు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) తెలిపారు.

Hyderabad: పార్సిల్‌ పేరుతో బెదిరింపులు.. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు

- వయసు మళ్లిన వారే టార్గెట్‌..

- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో నెల రోజుల క్రితం వరకు నమోదైన కేసుల్లో సరాసరి మొత్తం రోజుకు రూ. 1.50 కోట్లు కాగా, ఈనెల ప్రారంభం నుంచి నమోదవుతున్న కేసుల్లో ప్రతి రోజు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) తెలిపారు. ఇటీవల ఫెడెక్స్‌ పార్సిల్‌ పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు సీనియర్‌ సిటిజన్లు, రిటైర్డ్‌ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

- నగరానికి చెందిన 74 ఏళ్ల వ్యక్తికి సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌ చేసి, ఫెడెక్స్‌ కొరియర్‌ సర్వీ్‌సలో మీ పేరున బ్యాంకాక్‌ నుంచి థాయ్‌లాండ్‌కు పంపిన పార్సిల్‌ అడ్రస్‌ సరిగా లేని కారణంగా తిరిగి వచ్చిందని చెప్పారు. అందులో పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు, 140 గ్రాముల ఎండీఎంఏతో పాటు, 4 కిలోల దుస్తులు ఉన్నాయని, దీనిపై కేసు నమోదైందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్‌కు అనుసంధానమైన ఖాతాల నుంచి విదేశాలకు 66.88 మిలియన్ల డాలర్ల హవాలా డబ్బు వెళ్లిందని, ఇందులో కొంత మొత్తం బ్యాంకాక్‌ పోలీసులు సీజ్‌ చేశారని చెప్పాడు. మీపై కేసు నమోదైందని, ఏక్షణంలోనైనా అరెస్టు అయ్యే అవకాశముందని బెదిరించాడు. మీ ఖాతాల్లో ఉన్న డబ్బును సీబీఐ ఖాతాకు బదిలీ చేయాలని సూచించి రూ. 91.64 లక్షలు కాజేశాడు.

ఇదికూడా చదవండి: KCR: మూర్ఖ ముఖ్యమంత్రి..

- నగరానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి (66)కి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి, తైవాన్‌కు బుక్‌ చేసిన పార్సిల్‌లో మీ ఆధార్‌ వివరాలు ఉన్నాయని చెప్పాడు. వెంటనే స్కైప్‌ వీడియో కాల్‌లో పోలీస్‌ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఫోన్‌ చేసి, ముంబై క్రైం బ్రాంచ్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాల్లో ఉన్న ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని, దానికి సంబంధించి కోల్‌కతా, గోవా, బెంగళూరు, ముంబైల్లో కేసులు నమోదయ్యాయని చెప్పాడు. ఓ వ్యక్తి ఫొటో చూపుతూ ఉగ్రమూకలకు నిధులు సరఫరా చేస్తున్న నిందితుడిని అరెస్ట్‌ చేశామని, అతడిచ్చిన సమాచారంతోనే మీకు ఫోన్‌ చేస్తున్నామని చెప్పాడు. ఉగ్ర సంస్థల స్లీపర్‌ సెల్స్‌ మీకు, మీ కుటుంబానికి హాని చేయవచ్చని, అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండాలని చెప్పాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బును ఆర్‌బీఐ ఖాతాలోకి మార్చాలని, ఆర్‌బీఐ అధికారులు తనిఖీ చేసి తిరిగి మీ ఖాతాలో జమచేస్తారని చెప్పి, అతడి ఖాతాలో ఉన్న రూ. 20.20 లక్షలు కాజేశారు.

- నగరానికి చెందిన వ్యాపారి (46)కి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ముంబై నుంచి తైవాన్‌ వెళుతున్న విమానంలో మీ పేరున పార్సిల్‌ ఉందని, అందులో డ్రగ్స్‌, బ్యాంకు పాస్‌ పుస్తకాలు, పాస్‌పోర్టులు ఉన్నాయని చెప్పారు. ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పాడు. కొంతసేపటికి వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు నకిలీ ఐడీ కార్డు చూపాడు. మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు హవాలా డబ్బు తరలిందని, దీనిపై మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పాడు. మీ ఖాతాల్లో ఉన్న డబ్బు స్ర్కీనింగ్‌ చేయాలంటూ రూ. 1.22 కోట్లు కాజేశాడు.

ఇదికూడా చదవండి: Telangana Elections 2024: మెతుకు సీమ మద్దతెవరికో!

అప్రమత్తతే ఆయుధం: సైబర్‌ క్రైం పోలీసులు

- మోసాలు జరిగే తీరును తెలుసుకుంటే అప్రమత్తంగా ఉండొచ్చని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సలహాలు, సూచనలు అందించారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాములు, (వాట్సప్‌, టెలిగ్రామ్‌) కొత్త గ్రూపుల్లో జాయిన్‌ కావద్దు. ఇలా చేయడం వల్ల మన వివరాలు ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొత్త నెంబర్ల నుంచి వీడియో, స్కైప్‌ కాల్స్‌ను స్వీకరించవద్దు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ కేవలం సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు సూచించిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఆన్‌లైన్‌ వీడియో కాల్స్‌లో తాను పోలీస్‌ అధికారినంటూ ఐడీ కార్డు, ఇతర కేంద్ర సంస్థల లెటర్‌హెడ్‌లు, మెయిల్‌లను చూపే వారిని నమ్మకూడదు. సైబర్‌ నేరగాడు చెప్పిన వివరాలను ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా 100కు ఫోన్‌ చేసి పోలీసులను ఆశ్రయించండి.

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 10:47 AM