Share News

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

ABN , Publish Date - Mar 20 , 2024 | 09:52 AM

అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management Agency) హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.

విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం..

ద్రోణి ప్రభావంతో విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గాలులు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరు జల్లులే పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. అనేక చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజలను భయపెట్టాయి. ఈ వర్షాలు మామిడి, పత్తి, రబీ వరి, ఇతర ఉద్యాన పంటలకు ఉపయోగమంటున్నారు. కాగా రానున్న రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పిడుగు పడి గాయాలు

గుర్ల: గూడెం, తెట్టంగి గ్రామాల సరిహద్దులో పంట పొలాల్లో మంగళవారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తోట బంగారయ్య, సత్తిబాబులు పంట పొలాల్లో ఆవులు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో వారికి సమీపంలో పిడుగు పడింది. ఆ దాటికి ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

జాతరలో నేలకొరిగిన లైటింగ్‌ సెట్టు

చీపురుపలి: చీపురుపల్లిలో మంగళవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. మూడు గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం నాలుగున్నర వరకూ ఏకధాటిగా కురిసింది. వడగళ్లతో కూడిన వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కనకమహాలక్ష్మి జాతరలో ఆకర్షణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ సెట్టు రోడ్డుకు అడ్డంగా నేలకొరిగింది.

Updated Date - Mar 20 , 2024 | 10:11 AM