Share News

Andhra Pradesh: ప్రాజెక్టులపై పగ.. జగన్ మాటలు, చేతలన్నీ మోసపూరితమే..!

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:45 AM

ఇది మోసపూరిత ప్రభుత్వం.. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది.

Andhra Pradesh: ప్రాజెక్టులపై పగ.. జగన్ మాటలు, చేతలన్నీ మోసపూరితమే..!
AP CM YS Jagan

  • గత ఐదేళ్లలో వెలిగొండ టన్నెల్‌లో ఒక్క మీటర్‌ కూడా లైనింగ్‌ పనులు చేయడం చేతకాని జగన్‌ ప్రభుత్వం.. సొరంగాలు పూర్తయి నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని పచ్చి అబద్ధం చెబుతోంది.

  • వరికపూడిసెల ఎత్తిపోతలకు ఇంతవరకు పర్యావరణ అనుమతే తీసుకోలేదు.

  • కనీసం దరఖాస్తు కూడా చేయలేదు.

  • కేంద్ర జలసంఘం ఆమోదించిన దానికంటే పోలవరం అంచనాలను రూ.8,932 కోట్లకు ఆర్‌సీసీ తగ్గిస్తే.. జగన్‌ కనీసం నిరసన తెలుపలేదు. పైగా గుడ్డిగా సంతకాలు చేసేశారు.

  • వెలిగొండ, పోలవరానికి పాతర

  • రూ.32 కోట్లు కట్టక వరికపూడిసెల గాలికి

  • దానికి పర్యావరణ అనుమతే తీసుకోలేదు

  • చెడిపోయిన బోరింగ్‌ మెషిన్‌

  • రెండేళ్లుగా వెలిగొండ టన్నెల్‌లోనే

  • శ్రీశైలంలో నీళ్లు లేనందునే నల్లమలసాగర్‌కు

  • ఇవ్వలేకపోతున్నామని తప్పుడు ప్రచారం

  • డ్యాంలో నీరున్నా వదలలేరు.. వదిలితే ఐదారు చోట్ల గండిపడి గ్రామాల మునక

  • పోలవరం ఖర్చును ఆర్‌సీసీ కుదిస్తే చప్పట్లు.. కిమ్మనకుండా సంతకాలు

  • ఆయకట్టు రైతులను, ముంపువాసులను

    నిలువునా ముంచేసిన ముఖ్యమంత్రి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఇది మోసపూరిత ప్రభుత్వం.. వైసీపీ(YSRCP) మేనిఫెస్టోలో చెప్పిన వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులను(Polavaram Project) పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా వెలిగొండ విషయంలో సీఎం జగన్‌(CM YS Jagan) ప్రజలను మభ్యపెట్టి మాయచేస్తున్నారు. ఈ ఐదేళ్లూ ఆయనది నిష్ర్కియాపరత్వమే! ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సిద్ధం చేసి నీరు నింపాలంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. మరో రూ.5,000 కోట్లు కావాలి. గత ఐదేళ్లలో కనీసం రూ.1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. అలాగే పోలవరం పూర్తిచేస్తామంటూ మేనిఫెస్టోలో, ఆ తర్వాత అసెంబ్లీలోనూ మాయమాటలు చెప్పిన జగన్‌.. ప్రాజెక్టు ఖర్చును కేంద్రం నియమించిన అంచనాల సవరణల కమిటీ (ఆర్‌సీసీ) రూ.8,932 కోట్ల మేర తగ్గిస్తే కిమ్మనలేదు. పైగా ఆయన ప్రభుత్వం చప్పట్లు కొట్టి సంతకాలు పెట్టొచ్చింది. పల్నాడు జీవనాడి వరికపూడిసెల వేదన వర్ణనాతీతం. కేవలం రూ.32 కోట్లు అటవీ శాఖకు చెల్లిస్తే ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. కానీ జగన్‌ సర్కారుకు మనసురాక పల్నాడు ప్రాంతాన్ని, రైతాంగాన్ని దాహార్తికి వదిలేసింది.

వెలిగొండపై అడుగడుగునా అబద్ధాలు

మార్చి 7వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలు ప్రారంభిస్తూ.. ప్రకాశం ప్రజల 20 ఏళ్ల కల నెరవేరిందన్నారు. కానీ ఈ ఐదేళ్లలో టన్నెల్‌కి ఒక్క మీటర్‌ మేర కూడా లైనింగ్‌ పనులు చేయని చేతకాని ప్రభుత్వం ఇది. వెలిగొండ సొరంగాలు పూర్తయి నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పుకోవడం పచ్చి అబద్ధం. వీటిని ప్రారంభించడమంటే పశ్చిమ ప్రకాశం, బద్వేలు, ఉదయగిరి ప్రజలను మోసం చేయడమే.

రెండో సొరంగంలో ఉన్న టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ అందులోనే ఉండిపోయింది. దానిని బయటకు తీయలేదు. అది 12వ కిలోమీటర్‌ వద్ద చెడిపోయి బయటకు తేలేని పరిస్థితిలో ఉంది. దాన్ని బయటకు తీయడం సాంకేతికంగా సాధ్యం కాదు. అక్కడే ఒక చిన్న బైపాస్‌ చేసి అందులో పూడ్చిపెట్టాలి. ఈ విషయం తెలిసి కూడా రెండేళ్ల నుంచి ఈ పని ఎందుకు చేయడం లేదు? దీనిని కప్పిపుచ్చడం కోసం ప్రారంభోత్సవాలంటూ జగన్‌ దొంగాట ఆడుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేనందున నల్లమల సాగర్‌కు నీళ్లు పంపలేకపోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవం ఏమిటంటే శ్రీశైలంలో నీళ్లున్నా వెలిగొండకు విడుదల చేయలేరు. ఇది పచ్చి నిజం. రెండో టన్నెల్‌లో బోరింగ్‌ మెషీన్‌ అడ్డంగా ఉంటే నీళ్లు ఎలా వదులుతారు?

వైసీపీ హయాంలో ఒక్కరికైనా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించారా? కల్పించామని చెప్పే ధైర్యం ఉందా? ఒక్కరిని కూడా ముంపు నుంచి తరలించకుండా నల్లమలసాగర్‌లో నీరు ఎలా నింపుతారు? ఏమీ చేయకుండా ప్రారంభోత్సవాలు చేసే నైతిక హక్కు ఉందా? ఈ రోజు శ్రీశైలం డ్యాంలో నీరు ఉండి, వదిలితే నేరుగా సుంకేసుల గ్రామంలోకి వెళ్తాయి. ఇది నిజమా కాదా? పునరావాసం పూర్తి చేయడానికి ఇంకా రూ.1,200 కోట్లు కావాలి.

గత ప్రభుత్వాలు నిర్మించిన ఫీడర్‌ కెనాల్‌ అధ్వాన పరిస్థితిలో ఉంది. దాని గుండా నీరు నల్లమలసాగర్‌కు వదిలితే అది కనీసం ఐదారు చోట్ల తెగిపోయి నల్లమలసాగర్‌లోకి వెళ్లే బదులు సమీప గ్రామాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ విషయం వైసీపీ ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ ఐదేళ్లూ దానిని సరిచేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు?

మొదటి సొరంగంలో ఒక కిలోమీటర్‌, 2వ సొరంగంలో 7 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇది పూర్తి చేయకుండా నిర్దేశిత పరిమాణంలో నీరు ఎలా వెళ్తుంది? ఎక్కడైనా వీక్‌జోన్‌ ఉండి, సొరంగం కూలిపోతే దీనికి బాధ్యులెవరు? జూ నల్లమల సాగర్‌లో ఒకవేళ నీరు నింపగలిగినా.. కాలువల ద్వారా వదిలే పరిస్థితి ఉందా? జగన్‌ హయాంలో డిస్ర్టిబ్యూటరీ నెట్‌వర్క్‌ ఎన్ని ఎకరాలకు అదనంగా అభివృద్ధి చేశారో చెప్పగలరా?

పోలవరం ప్రాజెక్టుపై మాయలు

టీడీపీ హయాంలో 2019 ఫిబ్రవరిలో ప్రాజెక్టు ఖర్చును రూ.55,657 కోట్లకు కేంద్ర జలసంఘం నియమించిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) ఆమోదించింది. ఇది జరిగి ఐదేళ్లవుతోంది. జగన్‌ ప్రభుత్వం ఇంతవరకు రూ.55,657 కోట్ల పెట్టుబడి అనుమతిని కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖల నుంచి తెచ్చుకోలేకపోయింది. క్రమం తప్పకుండా ఢిల్లీ వెళ్లే సీఎం జగన్‌.. 22 మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని కూడా కేంద్రం నుంచి ఈ అనుమతి సాధించలేకపోయారు.

టీడీపీ ప్రభుత్వం రూ.55,657 కోట్లకు సాధించిన అనుమతిని ఆర్‌సీసీ 2020 మార్చిలో రూ.46,257 కోట్లకు కుదించింది. సీఎం జగన్‌, 22 మంది ఎంపీలు అందుకు తలకాయలు ఊపి, చప్పట్లు కొట్టి సంతకాలు పెట్టి వచ్చారు. వీరి ప్రతాపం ప్రశ్నించే సామాన్యులపై, అణగారిన వర్గాల మీదే.

ఆర్‌సీసీ కోత విధించి కొత్తగా ఖరారు చేసిన రూ.46,725 కోట్లకు కూడా కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖ నుంచి అనుమతి తెచ్చుకోలేక కొత్త నాటకానికి తెరతీశారు. ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తానని విభజించారు. మొదటి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నింపి పాక్షిక ప్రయోజనాలు కల్పిస్తామంటారు. మొదటి దశ పూర్తికి రూ.15,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాశామని పదే పదే చెబుతుంటారు. ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు నిజంగా అడుగుతున్నారో లేదో అనుమానమే!

ప్రధాన తూము నుంచి కాలువలను అనుసంధానించే సొరంగం పనులు, ఇంకొన్ని అనుబంధ పనులు ఇంకా ఎందుకు పూర్తికావడం లేదో సామాన్యుడికి అర్థం కాని ప్రశ్నే.

32 కోట్ల కోసం వరికపూడిసెల బలి

వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులూ సాధించామని జగన్‌ సర్కార్‌ డప్పు కొట్టుకోవడం తప్పితే నయాపైసా పని జరగలేదు. అనుమతులు వచ్చేశాయంటూ నిరుడు నవంబరులో సీఎం హడావుడిగా భూమిపూజ చేశారు. వాస్తవమేమిటంటే.. ఈ ప్రాజెక్టు కింద అవసరమైన 19 హెక్టార్ల అటవీ భూమి అప్పగించడానికి అటవీ పరిహారం కింద రూ.32 కోట్లు కట్టాలని అటవీ శాఖ 3 నెలల ముందే సమాచారమిచ్చినా ఈ డబ్బు ఆ శాఖకు జమ చేయలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభించనూ లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 10:29 AM