Share News

AP Politics: మా వాళ్లనే అరెస్టు చేస్తారా?.. పీఎస్‌లో బాలినేని హల్‌చల్..

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:17 AM

వైసీపీ(YSRCP) బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. ఒంగోలులో వరుస ఘటనలే అందుకు నిదర్శనం. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే(Police Station) ఎమ్మెల్యే, ఆయన తనయుడు, వారి అనుచరులు హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు(Ongole) వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivas Reddy), ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో..

AP Politics: మా వాళ్లనే అరెస్టు చేస్తారా?.. పీఎస్‌లో బాలినేని హల్‌చల్..
Balineni Srinivas Reddy

  • పోలీసు స్టేషన్‌లో బాలినేని హల్‌చల్‌

  • అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదంటూ బైఠాయింపు

  • అరెస్టులు విరమించి నోటీసులతో సరి

  • తానూ కేసులో ఉన్నానని, నోటీసు తీసుకుంటానని బాలినేని వెల్లడి

  • రెండు గంటల పాటు వన్‌టౌన్‌లో హైటెన్షన్‌

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 13: వైసీపీ(YSRCP) బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. ఒంగోలులో వరుస ఘటనలే అందుకు నిదర్శనం. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే(Police Station) ఎమ్మెల్యే, ఆయన తనయుడు, వారి అనుచరులు హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు(Ongole) వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivas Reddy), ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి సుమారు రెండు గంటల పాటు హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై దాడిచేసి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. అదేక్రమంలో రిమ్స్‌లో క్యాజువాలిటీ ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టిన కేసుకు సంబంధించి పోలీసులు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలను శుక్రవారం తెల్లవారుజాము నుంచి అరెస్టు చేశారు. ఈ క్రమంలో తనకు తెలియకుండా వైసీపీ కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుపోవడం ఏమిటంటూ బాలినేని నేరుగా ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.


మొదట అక్కడ ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం అక్కడే రెండున్నర గంటల పాటు సీఐ లక్ష్మణ్‌ రూంలో కూర్చున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి శ్రేణులతో కలిసి వచ్చి స్టేషన్‌ ఎదుట తిష్ట వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి, కేసు దర్యాప్తు చేస్తున్న చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌ ఉన్నారు. రిమ్స్‌ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకూ నలుగురు టీడీపీ, 10మంది వైసీపీ వారిని అరెస్టు చేశారు. బాలినేని వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత కేసులో ఉన్న వారందరికీ 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి, ఆర్డీఓ దగ్గర బైండోవర్‌ చేశారు. నేరుగా బాలినేని మీడియాకు అదే విషయం తెలియజేశారు. తాను కూడా ఈ కేసులో ఉన్నాన ని, నోటీసులు తీసుకుంటానని బాలినేని చెప్పడం గమనార్హం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 07:17 AM